Road Accident: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, పది మంది గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన 13 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలంలోని స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద వీరి వాహనం కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు కారులో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ మృతి చెందగా, మరొ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ వెనుక ఇరుక్కుపోయిన కారును పోలీసులు రెండు క్రైన్ల సాయంతో బయటకు తీశారు. మృతుల్లో డ్రైవర్ శంఖు, సయ్యద్ రఫీతుల హస్మీ, వజహాబ్ హస్మి, సలీమా, జూబియాలు ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.