గుజరాత్ మోర్బీలో కేబుల్ వంతెన కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 134 కు చేరింది. మచ్చు నదిపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ తీగల బ్రిడ్జ్ కి ఇటీవల మరమ్మత్తులు పూర్తి చేసి ప్రారంభించారు. మరమ్మత్తులు పూర్తి అయి ప్రారంభించిన అయిదు రోజుల వ్యవధిలోనే ఆదివారం కేబుల్ బ్రిడ్జ్ కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై ఆదివారమే హైపవర్ కమిటీని నియమించిన ప్రభుత్వం .. తాజాగా వంతెన నిర్మాణ ఏజన్సీపై 304, 308, 114 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. మరో వైపు .. సహాయక సిబ్బంది 177 మందిని సురక్షితంగా కాపాడినట్లు రాష్ట్ర సమాాచార శాఖ పేర్కొంది. 19 మందికి గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించింది. ఆర్మీ, నెేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది సందర్శకులు ఉన్నట్లు తెలుస్తొంది. వంతెనపై ఉన్న కొంత మంది యువకులు ఆకతాయితనంతో ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ వంతెనను ఊపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జ్ కూలిపోవడంతో చాలా మంది నీటిలో పడి గల్లంతయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉండగా, వందల మంది గాయపడ్డారు. ప్రమాదం కారణంగా సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితిలు కనిపించాయి. ఈత వచ్చిన వారు ఒడ్డుకు చేరుకోగా, ఈత రాని వారు మునిగిపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ హాహాకారాలు చేశారు.
వంతెన కూలిన విషయం తెలియడంతోనే పోలీసు,, అగ్నిమాపక విభాగం అధికారులు, ఇతర సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం పడవల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుండి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అంతకు ముందు మోర్బీ జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల అధికారుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఈ తెల్లవారుజామున కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సీఎం భూపేంద్ర పటేల్ చేరుకుని రెస్క్యూ ఆపరేషన్, క్షతగాత్రులకు వైద్య సేవలు, బాధిత కుటుంబాలను ఆదుకోవడం తదితర విషయాలపై తగిన ఆదేశాలు జారీ చేశారు.
KCR: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మౌనం వీడి ఘాటుగా స్పందించిన సీఎం కేసిఆర్ .. ఎమన్నారంటే ..?