Suspicious Death: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం హుషారుగా కేరింతలు కొడుతూ సెల్ ఫోన్ తో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసిన ముగ్గురు బాలికలు ఊహించని విధంగా చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ విషాద ఘటన తానూరు మండలం సింగన్ గావ్ గ్రామంలో జరిగింది. విషయంలోకి వెళితే .. గ్రామానికి చెందిన అక్క చెల్లిళ్లు అస్మిత (15), వైశాలి (13) వారి బంధువుల అమ్మాయి అంజలి (15) ఆదివారం సరదాగా పొలం వద్దకు వెళ్లారు. పొలంలో చెట్టు కింద కూర్చుని వారు తెచ్చుకున్న ఆహార పదార్ధాలను తీసుకున్నారు.
అయితే ఎంత తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైశాలి, అస్మిత వాళ్ల తల్లి మంగళబాయి ముగ్గురిని ఇంటికి వెళ్లండని సూచించింది. అనంతరం వీళ్లు ఇంటికి వెళ్లే క్రమంలో స్థానిక చెరువు గట్టు మీదకు వెళ్లారు. పొలంలో, చెరువు వద్ద వీరు సెల్ఫీలు తీసుకున్నారు. అయితే వీరు ముగ్గురు రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యారు. ఇంకా పొలం వద్దనే ఉన్నారేమోనని పొలం వద్ద కు వెళ్లి చూశారు. అక్కడ వారి ఆచూకి లభించకపోవడంతో ఇంటికి వచ్చేశారు. ఈ రోజు ఉదయం మరో మారు పొలం వద్ద తరువాత చెరువు వద్ద పరిశీలించారు.
చెరువు నీటిలో ఇద్దరు బాలికల మృత దేహాలు తెలి ఉండటం గమనించిన గ్రామస్తులు అక్కడే గాలించగా మూడవ అమ్మాయి మృతదేహాం కూడా కనిపించింది. ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. ముగ్గురు బాలికల మృతితో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాణ వశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.