JC Prabhakar Reddy: ఏపి, తెలంగాణ జల జగడం నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ మంత్రులు ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఏపి నుండి గట్టిగా కౌంటర్ లు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ మంత్రులు ఏకంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఏపికి చెందిన ఒకరిద్దరు మంత్రులు మినహా పెద్దగా ఎవరూ స్పందించలేదు. అయితే దీనిపై తాజాగా అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి స్పందించారు. గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసి దివాకరరెడ్డి సోదరులు రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ పక్కకు వెళ్లలేక టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నేడు ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని పేర్కొన్నారు.
Read More: Maharashtra: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..! దేనికి సంకేతం..?
ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి, ప్రాంతాలకు అతీతంగా ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వైఎస్ఆర్ ను తెలంగాణకు ద్రోహం చేశాడనీ, రాక్షసుడని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖరరెడ్డి లాంటి పెద్ద నాయకుడిని రాక్షసుడని అంటారా అంటూ జేసి ప్రభాకరరెడ్డి ఫైర్ అయ్యారు. దివంగత నేత వైఎస్ఆర్ ను టీఆర్ఎస్ నేతలు బండబూతులు తిడుతుంటే ఏపి నాయకులు ఏమిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులపై బండ బూతులు తిట్టే ఏపి మంత్రి ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా అంటూ పరోక్షంగా కొడాలి నానిని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సెటిలర్స్ అంటే ఎవరు అని నిలదీశారు. తమ పిల్లలు హైదరాబాద్ లోనే పుట్టారని, అక్కడే చదువుకున్నారని జేసి అన్నారు. ఏపికి చెందిన ప్రజలు హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేస్తున్నారని అన్నారు.
టీడీపీలో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఏపికి చెందిన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అదే విధంగా తెలంగాణ మంత్రులు జేసి వ్యాఖ్యల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో?. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తుందంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఏపి సీఎం జగన్, దివంగత సీఎం వైఎస్ఆర్ లపై మంత్రులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క ఏపి అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి ప్రాజెక్టుల నుండి విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంపై ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన ఏపి మంత్రివర్గ సమావేశం తెలంగాణ చర్యలను తీవ్రంగా ఖండించింది.