Telangana BJP: తెలంగాణలో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. వాస్తవానికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ చాణిక్యం ముందు ప్రత్యర్ధులు నిలవడం కష్టమే అయినా ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల నేపథ్యంలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఏర్పడుతోంది. పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి టీఆర్ఎస్ సర్కార్ పై, సీఎం కేసిఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బీజేపీలో చేరికలు ప్రారంభం అయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు విజయం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాలుగు స్థానాల నుండి 40కిపైగా స్థానాలు కైవశం చేసుకోవడం, తాజాగా హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు ఆ పార్టీకి టానిక్ గా పని చేస్తున్నాయి.
Telangana BJP: చేరికలపై దృష్టి..
ఇటీవలే పార్టీలో మాజీ ఉద్యోగ సంఘాల నేత విఠల్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న తదితరులను పార్టీలో చేర్చుకున్నారు. ఇకపైనా టీఆర్ఎస్ అసంతృప్తి నేతలను, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను ఈటల రాజేందర్ కు, కాంగ్రెస్ పార్టీ లోని అసంతృప్తి నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను డీకే అరుణకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ తన సన్నిహితులైన టిఆర్ఎస్ నేతలను ఆకర్శించే అవకాశం ఉందని భావించిన కేసిఆర్ ఆయన ఎవరెవరితో సన్నిహితంగా ఉంటున్నారు. ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు అనే విషయాలపై నిఘా పెట్టారని అంటున్నారు. త్వరలో అనేక మంది వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరనున్నారని కూడా ఇటీవల ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసిన రవీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.