CM KCR: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక ప్రకటన చేశారు. గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ నేతల ధాన్యం వ్యవహారంపై మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి తెలంగాణ వడ్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కేసిఆర్ సైతం పాల్గొని కేంద్ర ప్రభుత్వతీరును తీవ్రంగా విమర్శించారు. ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
CM KCR: యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసిఆర్ మీడియాతో మాట్లాడారు. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటామని తెలిపారు. క్వింటాల్ రూ.1960లు చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ, ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుండి యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు కేసిఆర్. రైతులు తక్కువ ధరలకు ధాన్యం విక్రయించుకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.
కేంద్రం కపట ప్రేమ
ఇక తెలంగాణ పట్ల కేంద్రం ప్రభుత్వ వైఖరిపై కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయో ఆయా రాష్ట్రాలపై కేంద్రం కపట ప్రేమ చూపిస్తుందనీ, ఎన్నికలు అవ్వగానే మొండిచేయి చూపిస్తుందని కేసిఆర్ విమర్శించారు. రైతులు లేకపోత దేశమే లేదని అన్నారు. దేశంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని విమర్శించారు.