వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చి కారులో బయలుదేరిన షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కారు నుండి దిగకపోవడంతో క్రేన్ సాయంతోనే కారును ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఆమె పై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలియడంతో షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి, దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నుండి బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. దీంతో విజయమ్మ తన ఇంటి గేటు వద్దే భైటాయించారు.
ఈ సందర్భంగా విజయమ్మ ప్రభుత్వ తీరు పట్ల మండిపడ్డారు. తన కుమార్తెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారనీ, తన కుమార్తెను చూసేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఇంటికే తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారనీ, ఇంటికి తీసుకువచ్చే వరకూ ఇంటి గేటు వద్దే కూర్చుంటానని పేర్కొన్నారు. షర్మిల ఎక్కడా పరుష పదజాలం వాడలేదనీ, విమర్శిస్తే సమాధానం చెప్పాలి కానీ దాడులు చేస్తారా అని ప్రశ్నించారు విజయమ్మ, రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. ప్రజల నుండి షర్మిలను ఎవరూ వేరు చేయ్యలేరని అన్నారు. ఆడబిడ్డపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారని అన్నారు. షర్మిలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు విజయమ్మ.
కాగా షర్మిల అరెస్టుపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధకల్గించే అంశమని సజ్జల పేర్కొన్నారు. మరో పక్క షర్మిలను న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చేందుకు పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్దం చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ముందుగా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ నివాసంలో హజరుపర్చనున్నారు. ఇదిలా ఉండే షర్మిల అరెస్టు ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ టీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.