లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది. మధ్య తరగతి వర్గాలు చితికిపోతున్నాయి. పేద వర్గాలకు బతుకు ప్రస్నార్ధకమైంది. కూలీలకు కూటికి కష్టమవుతుంది. అది ఒక కోణం..! ఎంత చెప్పుకున్నా వారి కష్టాలు తీర్చలేనివి, చెప్పుకుంటే కన్నీటి కథలే అవన్నీ…! మరి ఈ సమయంలో ప్రైవేట్ సంస్థలు ఎలా స్పందించాలి? ఉద్యోగుల పట్ల ఎంత బాధ్యతగా మెలగాలి? తోడుగా నిలవాల్సిన సమయం ఇది. ఇన్నాళ్లు సంస్థకు పని చేసిన ఉద్యోగులకు ఆసరా కల్పించాల్సిన సమయం ఇది. కానీ నలుగురికి నీతులు చెప్పే, తాను బద్ధ నీతిపరుడిని అని, తాను నిజాయితీకి నిలువుటద్దం అని, తాను జ్ఞానిని, తాను రాజకీయ శక్తిని అని చెప్పుకునే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన పనేంటో తెలుసా? ఇంగితాన్ని మరిచి, బాధ్యత విడిచి వారి ఉద్యోగుల్ని తొలగించారు.
౩౦ శాతం మంది తొలగింపు, ఉన్నవారికి 20 శాతం జీతం కోత…!
పత్రికారంగం నష్టాల్లో ఉంది. యాడ్లు లేవు, వార్తలు నమ్మడం లేదు, సర్కిలేషన్ పడిపోతుంది. ఒకే, ఈ కష్టాలన్నీ ఓర్చుకునే శక్తి లేకుంటే ఉద్యోగులను పక్కన పెట్టడం సబబే. కానీ ముందస్తు సమాచారం ఇవ్వాలి, కొన్ని నెలల పాటు ఆదుకోవాలి. క్లిష్ట సమయంలో తొలగించకూడదు. కానీ లోకంలోనే అత్యంత నీతి జ్ఞానుడిని అనే భావనలో ఉండే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ఉద్యోగుల్లో 50 మందిని తొలగించారు. (జిల్లాల్లో డెస్కుల్లో పని చేసే ఎడిటోరియల్ సిబ్బందిలో 30 శాతం మందిని ఏప్రిల్ నుండి తొలగించారు. జిల్లా ఎడిషన్లు ఆగిపోవడంతో ఏప్రిల్ నెల నుండి జిల్లాల్లోని ఎడిటోరియల్ సిబ్బందిలో మూడో వంతు అంటే సుమారుగా 50 మందిని ఉద్యోగం నుండి తీసేసారు. ఉంచిన ఉద్యోగులకు కూడా జీతంలో 20 శాతం కోత విధించారు. అదేమని ప్రశ్నిస్తే తొలగించలేదు సంతోషించు అనే సమాధానం వస్తుంది.
తొలగించే సమయమా ఇది…!
సంస్థల్లో ఉద్యోగులను తొలగించే ముందు ఈ సమయంలో వారు బయట బతకగలరా? ఏదైనా ఉద్యోగంలో చేరగలరా? అనేది ఆలోచించాలి. కుటుంబాల భవిష్యత్తు కాస్తయినా పట్టించుకోవాలి. కానీ అదేమీ లేదు. ఉన్నపళంగా ఉద్యోగం పోవడంతో ఆ కుటుంబాలు అల్లాడుతున్నాయి. బయట పరిస్థితులు బాలేవు, ఉద్యోగంలో చేరలేరు. కనీసం ఏ వ్యాపారమూ చేసుకోలేరు. అత్యంత క్లిష్ట సమయం ఇది. సంస్థ తొలగించడంతో కుమిలిపోతూ అల్లాడుతున్నారు. జీతం తగ్గించిన ఉద్యోగులకు కూడా మళ్ళీ పెంచుతారని నమ్మకం కలిగించలేదట. మళ్ళీ పెంపుదల ఉండకపోవచ్చు. అనే సంకేతాలు ఇస్తున్నారు.
- తెలంగాణ లో అనతికాలంలోనే ఎదిగిన వెలుగు పత్రికలో కూడా 32 మంది సబ్ఎడిటర్లను తొలగించారు. ఏప్రిల్ నుండి ఆపేసారు. మే నెల నుండి మరో 25 మందిని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- ఈనాడులో కూడా పరిస్థితులు ఏమి బాలేవు. అయితే సంస్థ ఉద్యోగుల పట్ల ఎంతోకొంత బాధ్యతగా మెలిగే సంస్థగా ఈనాడుకు పేరుంది. అందుకే మే నెల నుండి ఎడిటోరియల్ సిబ్బందిలో 40 శాతం మందిని తొలగించే పనిలో ఈ సంస్థ ఉన్నట్టు సమాచారం. వారికి మిగిలి ఉన్న సర్వీస్ లో ఏడాదికి ఒక నెల చొప్పున వేతనం ఇచ్చి పంపించాలని అనుకుంటున్నారు. అయితే రెండు రోజులుగా పెద్దల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈనాడులో ప్రస్తుతం జిల్లా ఎడిషన్లు లేకపోవడంతో ప్రతి జిల్లా పరిధిలోనూ సగం మంది ఖాళీగా ఉంటున్నారు. ఇప్పటికే కడప యూనిట్ కార్యాలయాన్ని మూసివేయగా, ఒంగోలు యూనిట్ ని కూడా మూసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.