గ్రహాల కూటములు… శని ఆవహించడం… జాతక దోషం… నవగ్రహ శాంతి చేయడం… చెప్పుకోవాలే కానీ ఆ శాస్త్రంలో చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడెందుకు ప్రస్తావించడం అంటే నిన్నటికి నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కుర్చీ వెనుక ఉంటె గోడపై పూర్ణ వికసిత పద్మం తొలగించి దాని స్థానంలో రాష్ట్ర అధికారిక ముద్ర పెట్టించారు. దీనిపై ఎవరికీ తోచిన వాదన వారు వినిపిస్తున్నారు. ఎవరికీ తోచిన రాతలు వారు రాస్తున్నారు. కాకపోతే కొందరు కామన్సెన్స్ కూడా పక్కన పెట్టేసి రాసుకుంటున్నారు, కొందరు గ్రహాలు కలిసి రావడానికి అని రాసుకొస్తున్నారు. కొందరైతే కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు వస్తుండడం సెంటిమెంట్ గా జగన్ మార్పులు చేయించారని రాస్తున్నారు.
ఆ చిహ్నం అమరావతిది గనక…!
ఇవన్నీ అవసరం లేదు. జగన్ అగుడులు మనం తొలి నుంచి గమనిస్తే దీన్ని మార్చేయడం పెద్ద వ్యవహారమే కాదు. ఇన్ని రాతలు కూడా అవసరం లేదు. ఎన్ని చెప్పుకున్నా జగన్ మనసులో, మదిలో ప్రాధమికంగా ఉన్న బలమైన కారణాలు చాలు దాన్ని తొలగించడానికి… * అది అమరావతి రాజధానిగా నిర్ణయించిన తర్వాత బౌద్ధ చిహ్నంగా గోడపై పెట్టారు. అంటే అమరావతికి చిహ్నం. అసలు రాజధానిగా అమరావతి కీలకం కాదు, విశాఖ అనుకుంటున్న జగన్ ఇంకా ఆ చిహ్నం తొలగించమనడంలో ఆశ్చర్యం ఎందుకు..? * ఆ చిహ్నం చంద్రబాబు ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత నే బాబు రాజకీయంగా చాల దెబ్బ తిన్నాడు. అదే చిహ్నంతో ఇప్పుడు కొనసాగడం జగన్ కు ఇష్టం లేకనే తొలగించమని ఉండొచ్చు. ఈ రెండు మాత్రం ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఆ తర్వాత కోర్టు చిక్కులు, గ్రహాల అనుకూలతలు చర్చకు వస్తాయి. దీనిలో ఎవరి వాదన వారిది.
సిబ్బందినే కాదు వస్తువులు, వాస్తులూ మారుతాయి…!
సీఎం రాష్ట్రానికి బాస్. మార్పులు, చేర్పులు అన్ని ఆయన ఇష్టమే. అందుకే ఎవరి పాలనలో వారికి అనుగుణమైన మార్పులు జరుగుతుంటాయి. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు సీఎం కార్యాలయంలో పనిచేసిన సిబ్బందిలో చాల మంది ఇప్పుడు ఆ కార్యాలయంలో లేరు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలలోనే 35 మందిని మార్చేశారు. ఇప్పటికీ ఎడాపెడా మార్పులు జరుగుతున్నాయి. సలహాదారుల నియామకం నుండి పేషీల్లో అటెండర్ల వరకు మార్పులు తప్పలేదు. ఇదే సందర్భంలో కొన్ని వస్తువులు, వాస్తు పద్ధతులు కూడా మారిపోతున్నాయి. నిజానికి జగన్ ప్రస్తుత క్యాంపు కార్యాలయం పెద్దగా పట్టించుకోలేదు. విశాఖ రాజధానిగా మారిన తర్వాత తనకు పూర్తిగా నచ్చినట్టుగా మార్పులు, చేర్పులు చేయాలని అనుకుని కొన్ని చంద్రబాబు గుర్తులను, అమరావతి గుర్తులను అలాగే ఉంచారు. కానీ ఇటువంటి చిక్కులు వస్తున్నప్పుడు, రాజధాని మార్పు ఆలస్యం అవుతున్నప్పుడు ఇటువంటి మార్పులు ఇక తప్పకపోవచ్చు.