ఇసుక విషయంలో మొదటి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా గడచిన పది సంవత్సరాల నుంచి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తున్నది. అవినీతిని ఆపలేకపోతున్నది. ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఉచిత ఇసుక తీసుకువచ్చినా సరే ఉచితం పేరిట అక్రమాలు చాలా జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇసుక అక్రమాలు ఆగడం లేదు.
ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ నెల 13న ఆదేశాలు జారీ చేయగా.. నేటి నుంచి అవి అమలులోకి వచ్చాయి. ఇంత వరకు ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1,300లు చెల్లిస్తుండగా ఇకపై ఆ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచిత ఇసుకకు గృహ నిర్మాణదారులు గ్రామ సచివాలయం ద్వారా పర్మిట్ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నోటిఫై చేసిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక తరలించు కోవాల్సి ఉంటుంది.
ఇసుక పాలసీ సక్రమంగా అమలు జరగాలంటే జిల్లా స్థాయిలో మానిటరింగ్ అధికారులు ఉండాలి. అలాగే నియోజకవర్గం లో ఎక్కడెక్కడ రీచ్ లు ఉన్నాయో వాటికి అవినీతి మరకలు లేని నిజాయితీ బ్యాక్రౌండ్ ఉన్న ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఉండాలి. అప్పుడే ఉచిత ఇసుక అందరికీ అందుబాటులోకి వస్తుంది, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.