(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు పెరగడంతో 175 గేట్లను ఎత్తి పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శబరినది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో విలీన మండలాల్లో రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో చింతూరు, విఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాల్లో వరద నీరు చేరింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాపికొండల విహార యాత్రను రద్దు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం వద్ద 21 మీటర్లకు వరద నీరు చేరింది. కొత్తూరు కాజ్వేపైకి వరద నీరు చేరింది. కుక్కనూరు, పేలేరుపాడు మండలాలకు వరద ముంచెత్తింది. కుక్కనూరు – దాచారం వంతెనపైకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా వేలేరుపాడు మండలం ఎద్దువాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయలంక కాజ్వేపై అయిదు అడుగుల మేర గోదావరి ప్రవహిస్తున్నది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.