ఇటీవల ఏపిలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, టీ టీ డీ డిక్లరేషన్ అంశాలు తీవ్ర వివాదానికి, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసిన విషయం తెలిసిందే. బీ జే పీతో సహా హింధూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. టీ టీ డీ డిక్లరేషన్ అంశంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన అనంతరం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బ్రహ్మోత్సవాలకు వెళ్ళిన సమయంలో గతంలో మాదిరిగానే డిక్లరేషన్పై సంతకం చేయకుండానే పాల్గొన్నారు. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే తాజా ఈ వ్యవహారాలపై శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి స్పందించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. స్వామిజీ నేరుగా సీఎం జగన్మోహన రెడ్డి పేరు ప్రస్థావించకుండా వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి సీఎం జగన్కు నేరుగా తగిలేవిగా ఉన్నాయంటున్నారు.
ఆలయాలపై దాడుల గురించి స్వామిజీ ఎమన్నారంటే….
“ఆలయాలపై ఎవరు దాడులు చేసినా అది తప్పే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఆలయాలపై జరుగుతున్న దాడులకు ప్రజానీకానికి, అధికారులకు, ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. ఇలాంటి దాడులను ఎవరూ సమర్థించకూడదు. ఆలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి, దేవాలయాలపై దాడులు జరిగితే అది సమాజంపై జరిగినట్లుగానే పరిగణించాలి” అని అన్నారు చిన జీయర్ స్వామిజీ.
ఆలయ నియమ నిబంధనలు అందరూ పాటించాలి
“ప్రతి ఒక్కరికీ ఆలయాలను దర్శించుకునే హక్కు ఉంటుంది, దాన్ని ఎవరూ అడ్డుకోరు. అయితే దైవ దర్శనాలకు వెళ్లే వారు ఆయా ఆలయాలకు సంబంధించి నియమ నిబంధనలు పాటించాలి. నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది తప్పే అవుతుంది” అని చిన జీయర్ స్వామి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించే మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో గౌరవించే చిన జియ్యర్ స్వామీజీ మాట్లాడిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ఈ వివాదానికి స్వస్తి పలుకుతారని అందరూ భావిస్తున్నారు.
చిన జియ్యర్ స్వామి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చాలా భక్తిభావంతోనే ఉంటారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ శంషాబాధ్ మండలం ముచ్చింతలోని స్వామిజీ ఆశ్రమానికి వెళ్లి జియ్యర్ స్వామికి పాదాభివందనాలు చేసి మరీ ఆశీర్వచనాలు అందుకున్నారు. దాదాపు అరగంటకు పైగా వివిధ అంశాలపై స్వామిజీతో ముచ్చటించారు. ముఖ్య మంత్రి అయిన తరువాత కూడా ఇటీవల జియ్యర్ స్వామి మాతృమూర్తి స్వర్గస్తురాలైన సందర్భంలో స్వామిజీకి జగన్ నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు.