భోపాల్: మధ్యప్రదేశ్ లో ఇంకా ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఝభువా జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో వివాహిత మహిళ తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయినందుకు ఆమెకు పంచాయతీ పెద్దలు శిక్ష విధించారు. ఆమెను కొట్టడంతో పాటు భర్తను భుజాలపై మోసుకుని కొంతదూరం నడవాలని శిక్ష వేశారు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఆ 27 ఏళ్ల మహిళ పంచాయతీ పెద్దల మాట పాటించాల్సి వచ్చింది.
#WATCH Madhya Pradesh: Villagers force a woman to carry her husband on her shoulders as a punishment in Devigarh, Jhabua allegedly for marrying a man from a different caste. (12.4.19) pic.twitter.com/aNUKG4qX7p
— ANI (@ANI) April 13, 2019
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్తను మోసుకుని నడవలేక నడుస్తూ వెళ్తున్న ఆ మహిళ చుట్టూ కొంతమంది చేరి.. ఆమెను తిడుతూ ఏడిపించే ప్రయత్నం చేస్తుండటం వీడియోలో కనిపించింది. ఓ వృద్ధుడు నవ్వుతూ ఆమె ఎదుట డాన్సు చేస్తుండగా మరో వ్యక్తి ఆమెను కర్రతో కొడుతుంటాడు. భర్త శరీరం బరువును మోయలేకపోయినా బలవంతంగా ఆమెతో నడిపించారు. దేవీగఢ్ లోని తన భర్త ఇంటి నుంచి తాను ప్రేమించిన వ్యక్తితో కొన్ని రోజుల క్రితం ఆమె గుజరాత్ వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం భర్త, అత్తమామలు ఆమెను వెతికి పట్టుకుని తిరిగి దేవీగఢ్ తీసుకొచ్చారు. దాంతో గ్రామపెద్దలు ఆమెకు శిక్ష విధించారు. ఆ వీడియో వాట్సాప్ లో బాగా షేర్ అయింది.
దాదాపు 10-12 మంది మగవాళ్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని అదనపు ఎస్పీ విజయ్ దావర్ తెలిపారు. వాళ్లు ఆమె దుపట్టా లాగేశారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించి దాదాపు 12 మందిపై కేసు పెట్టారు.