అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయోధ్య వీధులలో ఎటుచూసినా రామస్మరనే. రహదారులు, ఆలయాలు ఇంటి గోడలు అంతా రంగు రంగు చిత్రాలతో ముస్తాబవుతున్నాయి. భూమి పూజకు మూడు రోజుల ముందు నుంచే రామనామ స్మరణతో అయోధ్యలో ఆధ్యాత్మిక వాతావరణం అంతటా అలుముకుంది.
ఆగస్టు 5వ తారీఖున రామ మందిరం కోసం జరగనున్న ఈ భూమి పూజకు ప్రధాని మోడీ మరియు కొంతమంది ప్రముఖుల సమక్షంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు భూమి పూజ ముహూర్తం నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రముఖ కార్యక్రమానికి అయోధ్య స్టేజి మీద ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించింది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
వాళ్లెవరు అనగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీసీఎం యోగి, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో పాటు మహంత్ నృత్య గోపాల్ దాస్. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు కూడా ఈ ట్రస్ట్ సిద్ధం చేసింది. పసుపు మరియు కాషాయం లాంటి దివ్యమైన రంగు మేళవింపుతో ఈ పత్రికను ముద్రించారు. పసుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా కాషాయం లో అక్షరాలు ఉన్నాయి.
ఈ పత్రికపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముగ్గురు పేర్లు మాత్రమే ముద్రించారు. ప్రధాని మోడీ చేతుల మీదగా అయోధ్య రామమందిరం భూమిపూజ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ ఆహ్వాన పత్రికలను 150 మందికి అతిథులకు పంపినట్లు సమాచారం. సరిగ్గా శ్రీరాముడు జన్మించిన శుభ ఘడియల్లో అనగా అభిజిత్ ముహూర్తంలోనే అయోధ్య రామమందిర శంకుస్థాపన నిర్ణయించారు.