విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేసిన రోజే… హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మంగళవారం మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. అయితే, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్లు తగిలాయి.
కీలక వ్యాఖ్యలు
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో తన అరెస్ట్పై స్టే ఇవ్వాలని కోరుతూ డాక్టర్ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ సందర్భంగా, తీర్పు సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ల తరబడి హోటల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. ఈ సెంటర్లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తుచేసింది. కోవిడ్ సెంటర్ నిర్వహణకు అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్వో కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆ ఒక్క మాటతో…..
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన కేసులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి క్వారంటైన్ సెంటర్లను ప్రభుత్వమే నడిపిన విషయాన్ని ప్రశ్నించింది. క్వారంటైన్ సెంటర్లకు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత, వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులదే కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది వద్ద స్పందన కరువైంది.
వారం రోజుల పాటు…
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో అధికారులను బాధ్యులుగా ఎందుకు చేర్చకూడదో చెప్పాలని ధర్మాసనం కోరింది. డాక్టర్ రమేష్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? లేదా తామే ఉత్తర్వులు ఇవ్వాలా? అని కోర్టు ప్రశ్నించగా.. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. మరింత వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజుల గడువు కోరారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రమేష్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం డాక్టర్ రమేష్తో పాటు.. రమేష్ హాస్పిటల్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.