రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగా నేతలు పని చేయడం ఒక ఎత్తు. సిద్ధాంతాలు, ఆదర్శలతో పని లేదు, అధికారమే పరమావధి అనేది మరొక ఎత్తు. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవహారాల్లో సిద్ధాంతాలు, ఆదర్శాలు మచ్చుకైనా కనబడటం లేదు. ప్రస్తుతం చాలా వరకు కనిపిస్తుంది అవకాశ వాద రాజకీయాలే. ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి వత్తాసుగా వ్యవహరించడం, ఎవరు ఏ పార్టీకి కమిట్మెంట్ అన్న సంగతి చెప్పలేని పరిస్థితి. ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకుల మధ్య విరుద్ధమైన అభిప్రాయాలు ఉండటం సహజమే. వాటిపై అంతర్గత సమావేశాల్లో చర్చించుకొని ఒక మాటపైనే పైకి ఉంటుంటారు. కానీ ఏపి ఒ వెరైటీ రాజకీయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జాతీయ పార్టీ అయిన బిజెపిలోని ఇద్దరు కీలక నేతల వ్యవహార శైలి ఇందుకు అద్దం పడుతోంది. వారు ఇద్దరు జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వారు చెరొక ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం ఇక్కడ వెరైటీ. ఇప్పటికే చాలా వరకు అర్థం అయింది అనుకుంటా. ఎవరెవరో.
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు వరకూ టిడిపిలో క్రీయాశీల నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పారిశ్రామిక వేత్త. కేంద్ర సహాయ మంత్రిగా మోడీ మొదటి మంత్రివర్గంలో పని చేశారు. రాష్ట్రంలో టిడిపికి గతంలో ఎన్నడూ లేని గడ్డుపరిస్థితి ఎదురుకావడంతో మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కలిసి బిజెపిలో విలీనం అయ్యారు సుజానా చౌదరి. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితులు, టీడీపీకి తొలి నుండి కమిట్మెంట్ గా పని చేసిన ఈ నేతలు బిజెపిలో చేరారంటే చాలా మంది సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబే వీరిని బిజెపిలోకి పంపారంటూ అధికార వైసీపీ నేతలు ఆనాడే విమర్శించారు. వారు అన్నట్లుగానే సుజనా చౌదరి బిజెపిలో ఉన్నా ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు వాదనను సమర్థిస్తూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. టిడిపి రాజకీయ విధానాలను ఆయన బాహాటంగానే సమర్ధిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో టిడిపి వాదనను ఆయన గట్టిగానే వినిపిస్తున్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని చెప్పుకుంటూ కూడా వచ్చారు. మూడు రాజధానుల విధానం అసాధ్యమని, అమరావతి నుండి రాజధాని అంగుళం కూడా కదలదని కూడా అన్నారు సుజనా చౌదరి. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ ఆయన జోక్యం చేసుకున్నట్లు బాహాటంగానే తెలిసిపోయింది. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వంపైనా తరచు విమర్శలు సంధిస్తూ వచ్చారు.
ఇక పోతే బిజెపిలోని మరో రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి జివిఎల్ నర్శింహరావు. బిజెపిలో అంచలంచెలుగా ఎదిగిన నేత. పార్టీకి కమిట్మెంట్ ఉన్న నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వాడే, కానీ ఏపి విషయానికి వస్తే కాస్త వైసీపీ సానుకూల దృక్పదంతో వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎప్పుడో ఒకటి రెండు సందర్భాలలోనే వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించీ విమర్శించనట్లు మాట్లాడుతూ ఉంటారు. సుజనా చౌదరి గానీ మరి ఇంకా ఎవరైనా అమరావతి రాజధాని విషయంలో అనుకూలంగా మాట్లాడితే వెంటనే జివిఎల్ కౌంటర్ ఇస్తుంటారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా, చేసుకోదా అని ఎవరూ ఆడగకముందే ఆయనే కల్పించుకుని మరీ రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది, కేంద్రం ఎట్టిపరిస్థితిలోనూ జోక్యం చేసుకోదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ వచ్చారు. ఆయన చెప్పినట్లుగానే కేంద్రం కూడా ఇటీవల ఒకటికి రెండు సార్లు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. మాకు సంబంధం లేదని.
ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు ఒకరు టిడిపికి, మరొకరు వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సుజన చౌదరిని వైసీపీ నేతలు, జివిఎల్ ను టీడీపి నేతలు విమర్శించడం ప్రారంభించారు. సుజన చౌదరి బిజెపిలో టిడిపి కోవర్టు అని వైసిపి నేతలు విమర్శిస్తుండగా వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ జివిఎల్ కు సమీప బంధువు అని అందుకే ఆయన వైసిపికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ టిడిపి సోషల్ మీడియా విమర్శలు లంకించుకొంది, ఇలా సోషల్ మీడియాలో కొనసాగుతున్న వైసిీపీ, టిడిపి విమర్శలు, ప్రతి విమర్శల పర్వం విడ్డూరంగా మారుతోంది.