(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డిఏ నుండి వైదొలగిన తరువాత చాలా కాలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. అయితే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఏమీ లేవు. ఇటీవల ఆయనకు కోవిడ్ 19 సోకడం, అనారోగ్యం పాలైన చికిత్స అనంతరం కోలుకున్న సందర్భంగా అమిత్షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరగానే పూర్తిస్థాయిలో కోలుకుంటానని చంద్రబాబుతో అమిత్షా చెప్పినట్లు తెలుస్తోంది.
గత నెల 2న అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా గురుగ్రామ్లోని మేదాంత హాస్పటల్లో చికిత్స పొందారు. 14వ తేదీన నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. హోం ఐసోలేషన్ లో ఉన్న సమయంలో మరో సారి అనారోగ్యం బారిన పడటంతో ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందారు అమిత్ షా. ఆరోగ్యం కుదుట పడటంతో గత నెల 31న ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.