కరోనా తర్వాత అక్కినేని సమంత వరసగా సినిమాలని సెట్స్ మీదకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. జాను లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ సమంత నుంచి కొత్త సినిమాలకి సంబంధించిన న్యూస్ ఏదీ రాలేదు. అయితే దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, డి.కె దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ లో నటించిందని అంటున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో సమంత తన క్యారెక్టర్ తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇన్నాళ్ళు సమంత కి సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
కాగా లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను వరసగా సినిమాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సమంత కమిటయిన రెండు సినిమాలు పట్టాలెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అందులో ఒక సినిమా నయనతార కాబోయో భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కించబోయో సినిమా. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుండగా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం.
ఇక కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవనన్ తెరకెక్కించబోయో ఒక పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు సమంత ఇంతకముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని వార్తలు వచ్చాయి. తెలుగు, తమిళంతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ నిర్మించనున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి సమంత తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఇందులో ఎలాంటి నిజం లేదని ఒక్కసారైనా దర్శక, నిర్మాతల్ని సంప్రదించకుండా ఎలా రాస్తారని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కరోనా మహమ్మారీ విషయంలో జాగ్రత్తలు వహిస్తూ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళేందుకు ప్లాన్స్ వేస్తుకుంటున్నట్టు తెలిపారు. ఇక సినిమాలో సమంత బదులుగా తాప్సీ నటిస్తుంది అన్న విషయం కూడా నిజం కాదట.