ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మాజీ మంత్రి అమిత్ షా మధ్య ఉన్న సఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరే ఇప్పుడు బీజేపీ రథసారథులు.
ఈ ఇద్దర మధ్య దోస్తీ గురించి అందరిదీ ఒకే మాట. అయితే, పలువురి అంచనాలకు భిన్నంగా ఈ ఇద్దరు నిర్ణయం తీసుకోవడంతో ఒకరికి లాభం ఒకరికి నష్టం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదంతా వీరి ఆస్తుల విషయం గురించే. గత జూన్ 30 నాటికి ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను మోదీ వెల్లడించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో అమిత్ షా తెలిపిన వివరాలు సైతం ఆలోచనలో పడేశాయి.
లక్ అంటే మోదీజీదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల జీతం రెండు లక్షలు. అందులో ఎక్కువ భాగాన్ని ఆయన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఒక సగటు మనిషి ఎలాగైతే మిగిలిన వేతనంలో కొంత భాగం బ్యాంకుల్లో దాచుకుంటాడో.. మోదీ కూడా అలాగే చేస్తారు. తన జీతంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. వాటి ద్వారానే ఆయనకు 36 లక్షల 53 వేలు లాభం వచ్చింది. వివరంగా చెప్పాలంటే, 15 నెలల క్రితం వరకు మోదీ చరాస్తుల విలువ ఒక కోటి 39 లక్షల 10 వేల 260. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు ఒక కోటి 75 లక్షల 63 వేల 618. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల 5 నెలల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు 36 లక్షల 53 వేలు పెరిగాయి.
అసలు ఎందుకు ఇలా?
నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)కు ప్రధానమంత్రి, ఆయన కేబినేట్లోని మంత్రులు ప్రతీ ఏటా తమ ఆస్తుల వివరాలను అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సమర్పించారు. పారదర్శకత కోసం ఆస్తులు వెల్లడించడం అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం నుంచే మొదలైంది. 2004లో వాజ్పేయి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి రాజకీయ నేతలు వారి ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తూ వస్తున్నారు. తాజాగా అందించిన ఈ వివరాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిక ప్రణాళికలపై పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మోదీ గురి కుదిరింది
మోదీ పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా పక్కా లెక్కలు వేసుకొని అడుగులు వేస్తుంటారు. అందుకే పన్ను మినహాయింపు ఉన్న మార్గాలపైనే దృష్టి పెడతారు. జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అలా పెట్టిన పెట్టుబడులే ప్రస్తుతం ఫలితాలు ఇచ్చాయి. NSCS పెట్టుబడులు పెరిగాయి. కానీ బీమా ప్రీమియంలో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. జూన్ 30 నాటికి మోదీ సేవింగ్స్ అకౌంట్లో 3 లక్షల 38 వేలు మాత్రమే ఉన్నాయి. ఇక తన వద్ద నగదు రూపంలో 31 వేల 450 రూపాయలు మాత్రమే ఉన్నట్లు మోదీ వెల్లడించారు. మోదీ యొక్క చరాస్థులు పెరుగుతున్నా.. స్థిరాస్తుల విషయంలో మాత్రం తేడా లేదు. గుజరాత్లోని గాంధీనగర్లో తన కుటుంబంతో కలిపి ఒక ఇల్లు, ఒక ఇంటి స్థలం ఉన్నాయి. వాటి విలువ ఒక కోటి 10 లక్షలు.
అమిత్ షా లెక్కలు తప్పాయి
రాజకీయ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా లెక్కలు పెట్టుబడుల విషయంలో తప్పాయి. హోంమంత్రి అమిత్ షా నికర ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే జూన్ 2020 నాటికి తగ్గాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి అమిత్ షా నికర ఆస్తుల విలువ రూ .28.63 కోట్లు.. గత ఏడాది రూ .32.3 కోట్లతో పోల్చితే దాదాపు రూ .3.67 కోట్లు తగ్గింది. షేర్ మార్కెట్లోని హెచ్చుతగ్గులు, మార్కెట్ సెంటిమెంట్ ప్రభావమే దీనికి కారణం. కాగా, అమిత్ షా 10 స్థిరాస్తులు కలిగి ఉన్నారు. అలాగే ఆయన అధీనంలో ఉన్న ఆస్తులు, తల్లి నుంచి వారసత్వంగా పంచుకున్న ఆస్తుల విలువ రూ. 13.56 కోట్లని పీఎంవో తెలిపింది. అమిత్ షా చేతుల్లో రూ. 15,814 నగదు, రూ. 1.04 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్.. రూ. 13.47 లక్షల విలువ గల ఇన్సూరెన్స్, పెన్షన్ పాలిసీలు.. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్లో మరో రూ. 2.79 లక్షలు. రూ. 44.47 లక్షలు విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి.