పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సందడి నెలకొంది. అయితే, ఈ ఎన్నికల్లో నాయకుల కంటే, తమిళ హీరోల సందడి ఎక్కువ అయిందని అంటున్నారు.
తాజాగా తెలుగు సినీ పరిశ్రమతో దగ్గరి సంబంధాలు ఉన్న ఇద్దరు హీరోలు ఈ రాజకీయాల్లో కీలకంగా మారారని అంటున్నారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో కమలహాసన్, యువ హీరో విజయ్ విషయంలో కీలక చర్చ జరుగుతోంది. ఇటు కమల్ అటు విజయ్ కీలక ప్రకటనలు చేశారు.
కమల్ హాసన్ కీలక ప్రకటన
సినీనటుడు, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గొంతు బలంగా వినిపిస్తానని అన్నారు. డీఎంకేతో కూటమికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగడం లేదన్న కమల్.. నవంబర్లో తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా మక్కల్ నీది మయం అవతరిస్తుందని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నానని కమల్ తెలిపారు. తనను బీజేపీకి బీ-టీమ్ అనడం దారుణమని కమల్ చెప్పారు. రజనీకాంత్ పార్టీ పెట్టినా.. పెట్టకపోయినా మద్దతు కోరుతానని స్పష్టం చేశారు. ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కమల్ హాసన్ చెప్పారు.
తండ్రితో విజయ్…
విజయర్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం విజయ్ తండ్రి చంద్రశేఖర్ దరఖాస్తు చేశారు. ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. ఆలిండియా దళపతి విజయ్ పేరుతో పార్టీ పెట్టడంతో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడని ప్రచారం జరగడంతో తమిళనాట తీవ్ర దుమారం రేగింది. పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం` ద్వారా విజయ్ పార్టీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ హైడ్రామా నెలకొంది. ఈ సమయంలో హీరో విజయ్ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. తన తండ్రి రిజిస్టర్ చేసిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్ ప్రకటించారు. తనకు తన తండ్రి పార్టీతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నాడు.
నా ఫోటో పెట్టుకోకండి….
తన అభిమానులు తన తండ్రి పెట్టిన పార్టీతో కలిసి పనిచేయరని కూడా విజయ్ పేర్కొన్నాడు. “నా ఫోటో గాని పేరు గాని ఉపయోగిస్తే ఊరుకునేది లేదు. `అని ఆయన హెచ్చరించారు. ఈ ఇద్దరు హీరోలు తమిళనాడు ఎన్నికల విషయంలో చేసిన కీలక ప్రకటనలు సంచలనంగా మారాయి.