ఏపీ రాజధానిపై త్వరలో క్లారిటీ రానుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 326 రోజులుగా 29 గ్రామాల రైతులు, మహిళలు ఆందోళనలు అమరావతినే రాజధానిగా ప్రకటించాలని ధర్నాలు చేస్తున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ వారు వెనుకడుగు వేయలేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దుపై వ్యతిరేకంగా హైకోర్టులో దాదాపు 69 పిటీషన్లు దాఖలయ్యాయి. ఇటివలే హైకోర్టులో వీటిపై రోజువారీ విచారణ కూడా ప్రారంభమైంది. వచ్చే డిసెంబర్ లో ఏపీ రాజధానిపై హైకోర్టు నుంచి కీలక తీర్పు వస్తందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ఆసక్తి రేపుతోంది.
వచ్చే నెలలో విషయం తేలిపోనుందా..?
అమరావతిపై హైకోర్టు త్వరలో కీలక తీర్పు ఇవ్వబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకై దాఖలైన పిటిషన్లు అన్నింటిపైనా హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఈమేరకు అమరావతిపై హైకోర్టు రాజ్యాంగపరమైన పలు అంశాలను ప్రస్తావించిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలపడం ఆసక్తి రేకెత్తిస్తోంది. గత సోమవారం ప్రారంభమైన రోజువారీ విచారణలో భాగంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు రైతుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వేల కోట్లు ఖర్చు అయ్యాయని.. రాజధానిని విశాఖకు తరలిస్తే భూములిచ్చిన రైతులతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘించినట్టేనని వారు హైకోర్టుకు విన్నవించారు
ఇంత జరిగాక తరలింపు ఎలా..?
రాజధాని కోసం రైతులు భూములు, ప్రజలు బాండ్లు, విరాళాలు.. కేంద్రం ఇచ్చిన నిధులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని మార్పు అంశంపై రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వ్యాఖ్యలు చేసిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ చెప్తున్నారు. అక్కడి భూముల్లో నిర్మాణాలు, వేల కోట్ల ఖర్చు, పంటలు పండే భూమిలో నిర్మాణాలు చేపట్టిన తర్వాత రాజధాని తరలింపు ఎలా చేస్తారనేదానిపైనే ప్రధానంగా విచారణ జరిగినట్టు ఆయన చెప్పుకొచ్చారు. రోజువారీ విచారణలో భాగంగా అమరావతిపై విచారణ ఈనెలాఖరు వరకూ జరుగుతాయని తెలుస్తోంది. దీంతో రాజధానిపై నిర్ణయాన్ని హైకోర్టు డిసెంబర్ లో తీర్పు ఇచ్చే అవకశం ఉందని అంటున్నారు.