సినిమాల్లో వినోదం, ట్రాజెడీ, ఎంటర్ టైన్మెంట్.. తోపాటు విప్లవ సినిమాలు కూడా ఉంటాయి. అయితే.. ఈ సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎంత పవర్ ఫుల్ కంటెంట్ ఉంటే.. అంత విజయం సాధిస్తాయి. అటువంటి సినిమాలు తెలుగులో ఎక్కువే ఉన్నాయి. ఈ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో ‘ఆర్.నారాయణమూర్తి’. ఈతరహా సినిమాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించారు. అలా.. ఆయన హీరోగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఒకటి ‘ఒరేయ్.. రిక్షా’. ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి.
తన గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి ఈ సినిమా చేశారు. అప్పటివరకూ దాసరి చేయని విభిన్నమైన జోనర్లో విప్లవ భావాలతో ఈ సినిమా కథ రాసుకున్నారు. నారాయణమూర్తి విప్లవానికి, దాసరి మార్క్ చెల్లెలి సెంటిమెంట్ తో ఈ సినిమాను దాసరి తెరకెక్కించారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా భారీ విజయం సాధించింది. 1995 నవంబర్ 9న విడుదలైన ఈ సినిమా కొన్ని సెంటర్లలో 175 రోజులు ఆడింది. రిక్షా కార్మికుడిగా నారాయణమూర్తి తన నట విశ్వరూపం చూపారు. దాదాపు మూడు రెట్లు లాభాలతో దాసరిని ఈ సినిమా ఆర్ధికంగా నిలబెట్టింది.
వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ఈ సినిమా విజయానికి మేజర్ ఎస్సెట్. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ మోగిపోయింది. ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను..’ అనే పాట సూపర్ హిట్ అయింది. సినిమాలో ఆరు పాటలు రాసిన గద్దర్ కు, సంగీతం అందించిన వందేమాతరం శ్రీనివాస్ కు నంది అవార్డులు దక్కాయి. అయితే.. గద్దర్ ఈ అవార్డును నిరాకరించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఒరేయ్.. రిక్షా 100 రోజుల ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఉత్సాహంతో దాసరి తీసిన ‘ఒసేయ్.. రాములమ్మ’ ఈ సినిమాను మించిన భారీ విజయం సాధించింది. దాసరి ఫిలిం యూనివర్శిటీ బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించారు దాసరి. వ్యవస్థల్లోని లోపాలు, సమాజంలోని సమస్యల కథలతో నారాయణమూర్తి అప్పటికే తన దర్శకత్వంలో దండోరా, ఎర్రసైన్యం, అడవిదివిటీలు, చీమలదండు.. వంటి సినిమాలు తీశారు. ఇవే ఆయనకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!