ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల మాట.. మా పంటపై కార్పొరేట్లకు అధికారం దక్కకూడదు.. అని. వీళ్లకు సంఘీభావంగా నిలుస్తున్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ప్రైవేటు చేతుల్లోకి వ్యవసాయం వెళ్లకూడదు అనే అంటున్నారు. ఇక దేశానికి కవచాలుగా చెప్పుకునే వామపక్షాలు ఈ విషయంలో తమ వాదనను బలంగానే వినిపిస్తున్నాయి. మోదీ పారిశ్రామిక వర్గాలకు కొమ్ము కాస్తున్నారు.. అని. నిజానికి 2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయనపై పడ్డ ముద్ర ఇదే. అంబానీ, అదానీల కోసమే ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని. కానీ.. ప్రభుత్వాలు, పార్టీలు ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నా.. దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం ‘ప్రైవైటీకరణ’ అనేది నిర్వివాదాంశం.
20 ఏళ్ల క్రితం..
రెండు దశాబ్దాల క్రితం కంప్యూటర్ విప్లవం మొదలైనప్పుడు ఇంటర్నెట్ గురించి దాదాపు ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే మనిషికి రోజు గడవదు. దాంతోనే సగం పనులు అవుతున్నాయి. అదే.. 20 ఏళ్ల క్రితం ఒక ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే గొప్పోళ్లు. ఇప్పడు మనిషికో మొబైల్. లోకల్ కాల్, ఎస్టీడీ కాల్స్ బిల్లులు భయపట్టెసేవి. విజయవాడ-హైదరాబాద్ అరగంట మాట్లాడాలంటే 100 రూపాయలు పైమాటే. రాత్రిళ్లే మాట్లాడాలి. ఇప్పుడు 149కి నెలంతా మాట్లాడుకోవచ్చు. ఫ్రిజ్, ఏసీ ఉంటే ఉన్నతవర్గాలు. ఇప్పుడు ఇవి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. విమానాలను గాల్లో చూడటమే తప్ప కల కనే పరిస్థితులు కూడా అప్పట్లో లేవు. ఇప్పుడు.. ఎవరైనా ఎక్కగలిగే రేట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రజలకు మేలే జరిగిందా..!?
ఇవన్నీ కార్పొరేట్లు తెచ్చిన మార్పులే. ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులే. కాంగ్రెస్ హయాంలో 1990ల్లోనే ఇందుకు విత్తనాలు చల్లారు. తర్వాత పీవీ నీళ్లు పోసి మొక్కలు వచ్చేలా చేశారు. వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ చెట్లు అయ్యేలా పెంచారు. ఇప్పుడు మోదీ వాటిని మహా వృక్షాలుగా మారుస్తున్నారు. కార్పొరేట్ శక్తులు కాకపోతే ప్రభుత్వాలే ఇవన్నీ చేయాలంటే అయ్యేపని కాదు. ఉద్యోగాలు కూడా ప్రభుత్వాలు 10 శాతం ఇస్తుంటే.. కార్పొరేట్లు 90 శాతం ఇస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు.. బతుకులు బాగు చేసుకుంటున్నారు. మొబైల్, సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్, బిజినెస్, కంప్యూటర్స్, ఫ్యాక్టరీలు, వినోదం, వ్యాపరం.. చివరికి ప్రభుత్వం నడిపే రైల్వేనే ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ఇంత అభివృద్ధికి కారణమైన కార్పొరేట్, పారిశ్రామీకీకరణ మరిన్ని ఫలాలు ఇస్తుందనే చెప్పాలి.