కింద పడ్డా.. తనదే పైచేయి అనుకున్నాడట.. వెనకటికి ఓ వ్యక్తి. అసెంబ్లీలో టీడీపీ వ్యవహారం ఇలానే ఉంది. బలం తక్కువయినా.. చేసే హడావుడి మాత్రం పెద్దది. తమ ఉనికిని కాపాడుకోవడానికే అలా చేస్తున్నారో.. అధికారం కోల్పోయామనే బాధ ఇంకా వెంటాడుతుందా.. అర్దం కాని పరిస్థితి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం.. బైఠాయించడం ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ వ్యక్తికి తగన పని. ప్రభుత్వ తీరుపై వ్యతిరేకంగానే అలా చేస్తున్నారా అంటే.. సభలో వాదోపవాదాలు సర్వసాధారణమైన విషయం. ఇప్పుడు కొత్తగా ప్రివిలేజ్ కమిటీ నోటీసుల వివాదం రచ్చకెక్కుతోంది. ఇద్దరు టీడీపీ నేతలపై ప్రభుత్వం సభాహక్కుల ఉల్లంఘన నోటీసులివ్వడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది.
అసెంబ్లీలో జరిగింది.. ఇదీ..
ఇటివలి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్లపై చర్చలో సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. పెన్షన్లు తమ ప్రభుత్వ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వం తక్కువిస్తోంది.. 45 ఏళ్లు దాటినివారికి పెన్షన్ ఇస్తానని ఇవ్వట్లేదు.. అని ఎమ్మెల్యే అన్నారు. దీనికి సీఎం జగన్ స్పందిస్తూ.. నిమ్మల రామానాయుడు డ్రామా ఆర్టిస్టులా వ్యవహరిస్తున్నారు.. ఆయన మాటల్లో నిజం లేదన్నారు. నేను డ్రామా నాయుడు అయితే మీరు ‘జైలు రెడ్డా’ అని కౌంటర్ వేశారు. దీంతో నిమ్మలకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. మరోవైపు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు జరిగిన వాదనల్లో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. మరోవైపు సీఎం జగన్ పై కూడా టీడీపీ నేతలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు.
టీడీపీ తీరు సరైనదేనా..?
ఈ వాదనలు, దూషణలపై దీనిపై నిన్న జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. విచారణకు రావాలని టీడీపీ నాయకులను ఆదేశించినా వారు రాలేదు. ఇరువైపులా నాయకులు వస్తే తాము విచారణకు వస్తామనేది టీడీపీ వాదన. వాదనలు ఉండాల్సిన సభలో వ్యక్తిగత దూషణలకు సభలో స్థానం లేకపోయినా నిమ్మల వ్యవహారికం తప్పే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేల బలం ఎక్కువే. కానీ.. సభలో సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేసింది లేదు. ప్రస్తుతం టీడీపీ తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.