కోల్కత్తా, మార్చి 8 : కోల్కత్తాలోని ఐటి హబ్ దగ్గర ప్రతక్షమైన ఒక ఫ్లెక్సీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో వివాదానికి తెరలేపింది. రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫోటో కూడా అందులో ఉండటమే ఇందుకు కారణం.
‘ఫేమస్ బెంగాలీ లెజెండ్స్ ‘ అని రాసి ఉన్న ఫ్లెక్సీలో రెండు వరుసల్లో 19వ, 20వ శతాబ్దానికి చెందిన 13 మంది ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి. వీరంతా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచినవారు. సాహిత్యం, దేశ స్వతంత్ర పోరాటం, సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు, విజ్ఞానశాస్త్రం, రాజకీయ రంగాల్లో నిష్ణాతులు. వీరితోపాటు చివరిలో మమతా బెనర్జీ ఫోటో ఉన్నది.
సామాజిక,మత సంస్కర్త రామ్ మోహన్ రాయ్, వితంతువుల పునర్వివాహానికి నాంది పలికిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, భారతీయ జాతీయ గీతం రచయిత బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ, బెంగాలీ కవులు టాగోర్, మైఖేల్ మధుసూదన్ దత్, కాజి నజ్రుల్ ఇస్లామ్, ప్రసిద్ధ బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్, శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్, 19వ శతాబ్దానికి చెందిన సన్యాసి రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యుడు,రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద, స్వతంత్ర సమరయోధుడు చిత్తరంజన్ దాస్, మాజీ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్లు ఆ ఫొటోల్లో ఉన్నారు.
ప్రముఖులతో పాటు మమతా బనెర్జీ ఉండటంతో సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బనెర్జీ గొప్ప నాయకురాలే కావచ్చు. కానీ ఇంతటి ప్రముఖులతో ఆమె ఫోటో ఉంచటం చాలా ఎక్కువ అని ఒక విద్యార్థి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.