(వ్యంగ్యవార్తావిభాగం)
హైదరాబాద్: రిటర్న్ గిఫ్ట్లపై తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి వచ్చే గిఫ్టులను లెక్క రాసుకుని రిటర్న్ గిఫ్టులు ఇచ్చే వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్కు కేటాయిస్తూ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహా కూటమిని ఏర్పాటు చేసి తనకు సవాలు విసిరిన వైనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏర్పాటు చేసిని తొలి ప్రెస్ మీట్లోనే ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తానంటూ ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన తన కుమారుడు కేటీఆర్ను ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ దగ్గరకు పంపారు. అంతటితో ఆగకుండా హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ప్రముఖులను జగన్ పార్టీలోకి పంపుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. డేటా చౌర్యంపై పరస్పరం కేసులు సరే సరి.
ఈ నేపథ్యంలో రిటర్న్ గిఫ్టు పని భారం బాగా పెరిగిపోవడంతో కేసీఆర్ అందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. ఇందుకు కావలసిన నిధులను పూర్తి బడ్జెట్లో ఒక విడి పద్దు కింద కేటాయిస్తారని తెలుస్తోంది. ఇది చాలా కీలకమైన శాఖ కావడంతో దీనికి అవసరమైన అదనపు నిధులను సమీకరించేందుకు అవసరమైతే విదేశ ద్రవ్య సంస్థల నుండి మరిన్నిరుణాలు తీసుకోవాలంటూ కేసీఆర్ నిర్ణయించారని తెలంగాణ సీఎంఓ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
అలాగే ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాలకు కూడా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ శాఖను ఆయన తన వద్దే ఉంచుకోవాలను కుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, రిటర్న్ గిఫ్టుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రటనలో హర్షం వ్యక్తం చేసింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దీనిపై మండిపడ్డాయి. రాజకీయవైరాలకు ప్రభుత్వశాఖలను వాడుకోవడం అప్రజాస్వామికమని ఆ పార్టీలు వ్యాఖ్యానించాయి. తమనిలా రెచ్చగొడితే మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏపీలో కూడా రిటర్న్ గిఫ్టుల శాఖ ఏర్పాటు చేయడం ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ఈ వివాదంపై ప్రతిస్పందించిన టీఆర్ఎస్, తెలంగాణ అన్నిటా యావత్ దేశానికే ఆదర్శంగా ఉంటున్నందున, రైతుబంధు పథకంలాగే కేంద్రంలోనూ రేపు రిటర్న్ గిఫ్టుల మంత్రిత్వశాఖ ఏర్పాటు కావడం ఖాయమని వ్యాఖ్యానించింది.