(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం)
లక్నో: నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేసి అన్నంత పనీ చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారిపై బద్లా (ప్రతీకారం) తీర్చుకుంటామని సీఎం యోగి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఆందోళన జరిగిన ప్రాంతాల్లో ఆస్తి నష్టం, అందుకు కారకులైన వారిని గుర్తించిన ప్రభుత్వం ఆందోళనకారుల ఆస్తుల జప్తు ప్రక్రియను ప్రారంభించింది. దానికి కొనసాగింపుగా యోగి మరికొన్ని చర్యలకు పూనుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇకపై ప్రభుత్వ విెధానాలను ఎవరు వ్యతిరేకించినా వారి ఆస్తులు జప్తు చేస్తారు. వాటిని బహిరంగంగా వేలం వేస్తారు. వారికి రేషన్ కట్ చేస్తారు. వారి ఇళ్లకు కరెంట్, నీటి సరఫరా కూడా తక్షణం నిలిపివేస్తారు. ఆధార్ రద్దు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తారు. దీంతో ఆందోళనకారులు తమ పౌరసత్వాన్ని కోల్పోయేలా చేస్తారు. అప్పుడిక వారు దేశపౌరులు కారు కనుక అక్రమ నివాసులవుతారు. అలాంటి వారిని డిటెన్షన్ క్యాంపుల్లోకి పంపిస్తారు. ఈ విధానం కనుక విజయవంతమయితే దేశమంతా దీన్ని అమలు చేసేందుకుగాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఒప్పిస్తారని భావిస్తున్నారు.
ఈ స్కీమ్ కు ‘బద్లా’ అని నామకరణం చేస్తారు. బద్ లా లో లా (LAW) అన్న పదం కూడా ఉంది కనుక ఈ పేరు సరిగ్గా సరిపోతుందని యోగి సూచించినట్లు అధికారవర్గాల సమాచారం. అలాగే ప్రభుత్వ అనుకూల పౌరులను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందించేందుకూ కసరత్తు ప్రారంభించారు. యోగి హెయిర్ కట్, యోగి డ్రెస్ ఫాలో అయినవారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. వారికి ఉచిత బస్ పాసులిస్తారు. వారి కుటుంబాలకు సబ్సిడీ రేటుపై ఉల్లిపాయలు అందిస్తారు. వారిలో కొందరికి ప్రత్యేక శిక్షణనిచ్చి బద్ లా వాలంటీర్లుగా కూడా నియమిస్తారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే వారిని పట్టి ఇచ్చే అధికారం ఈ బద్ లా వాలంటీర్లకు ఉంటుంది. బద్లా కింద వసూలయ్యే మొత్తాలతో వీరికి జీతభత్యాలు కల్పిస్తారు. అందులో పోలీసులకు కూడా వాటా ఉంటుంది. మరోవైపు యోగి బద్లా కాన్సెప్టుతో బీజేపీ అనుకూల బాలీవుడ్ నిర్మాతలు అక్షయ్ కుమార్ హీరోగా ఒక మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బద్లా ద్వారా లభించే మొత్తంతో ఈ సినిమాకి ఫైనాన్స్ చేస్తారని భావిస్తున్నారు. దీనికి The Great CM Yogi అన్న ట్యాగ్ లైన్ పెట్టాలని నిర్ణయించారట. ఈ మూవీతో బద్లా మరింత పాపులర్ అవుతుందని యోగి ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి తమ ‘బద్లా’ మరీ కొత్తదేమీ కాదనీ, ఏపీలో సాగుతున్న ‘బద్లా’ టైపు రాజకీయాలే ఇందుకు సాక్ష్యమనీ యోగి కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీపై రోజూ బద్లా తీర్చుకోవడం లేదా అని ఆ ప్రకటనలో ప్రశ్నించారు. అమరావతిని శ్మశానమో ఎడారో చేసి మూడు రాజధానులను తెరపైకి తేవడం బద్లాయేనని యోగి కార్యాలయం వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ యుపి ఇన్ చార్జ్ ప్రియాంక గాంధీ బద్లా విధానాన్ని ఒక ట్వీట్ లో తీవ్రంగా తప్పుబట్టారు. బద్ లా ను ఆమె BAD LAW గా అభివర్ణించారు. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లలో సిక్కుల ఊచకోత బద్లా కానే కాదనీ, అది కేవలం ఒక మహావృక్షం కూలినందువల్ల వచ్చిన ప్రకంపనలేననీ ఆమె వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు బద్లా విధానాన్ని చట్టబద్ధం చేసే ప్రతిపాదనలను స్వాగతించారు. బీజేపీ చట్టబద్ధ పాలనను విశ్వసిస్తుందన్నారు. చట్టం తన పని చేసుకుని పోతూ ఉంటుందన్నారు.
——————————————————————————–——————————-
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.