రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి.. జేఎంఎం – కాంగ్రెస్ -ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీల నుంచీ ఒక్కొక్క మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, చిదంబరం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర నేతలు వస్తారని జార్ఖండ్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ కూడా కార్యక్రమానికి రావాల్సివుందని, అయితే, ఆమె స్వల్ప అనారోగ్యంతో ఉండటంతో రాలేకపోతున్నారని తెలిపాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కూడా సోరెన్ ప్రమాణానికి హాజరు కానున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోగా…జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో బీజేపీ 25 స్థానాలు దక్కించుకోగా.. జేఎంఎం 30 సీట్లు… కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక స్థానంలో గెలిచింది. మంత్రివర్గంలో జేఎంఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్పీకర్ పదవి కాంగ్రెస్ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.