కరోనా వ్యాక్సినేషన్ లోటుపాట్లు తెలుసుకునేందుకు జనవరి 2న దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెడీగా ఉండాలని ఆదేశించింది.
మూడు సెషన్స్లో రన్ జరుగుతుందని చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా సదుపాయాలు సరిగా లేని, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న జిల్లాలను డ్రై రన్కు ఎంపిక చేశామని.. మహారాష్ట్ర, కేరళల్లో రాజధానులు తప్ప మిగతా పెద్ద సిటీల్లో జరుగుతుందని వెల్లడించింది. కొవిన్ అప్లికేషన్ వాడకం, వ్యాక్సిన్ రవాణా, ప్లానింగ్ నుంచి అమలు చేసేవరకు లింకేజెస్ను తెలుసుకోవడానికి రన్ చేపడుతున్నామంది. వ్యాక్సినేషన్ ప్రిపరేషన్పై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర హెల్త్ అడ్మినిస్ట్రేటర్లతో కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వివరాలు అడిగి తెలుసుకున్నారు.దేశంలో ఏ టైమ్లోనైనా వ్యాక్సిన్కు అనుమతి వచ్చే అవకాశం ఉండటంతో కొవిన్ పనితీరు, సిబ్బంది రెడీనెస్, కోల్ట్ స్టోరేజీ, వ్యాక్సిన్ రవాణాలో లోటుపాట్లు తెలుసుకునేందుకు డిసెంబర్ 28, 29 తేదీల్లో డ్రైరన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అస్సాం, గుజరాత్లలో ఈ ప్రక్రియ చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ రన్ విజయవంతమైందని కేంద్రం ప్రకటించింది. అందుకే దేశవ్యాప్త డ్రై రన్కు సిద్ధమైంది.డ్రై రన్లో భాగంగా ప్రతి మెడికల్ ఆఫీసర్ ఇన్చార్జ్ వ్యాక్సిన్ వేసే 25 మందిని గుర్తిస్తారు. వీళ్ల డేటాను కొవిన్లో అప్లోడ్ చేస్తారు. రన్ జరుగుతున్న అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రాసెస్ అంతా చెక్ చేయనున్నారు.మొత్తమ్మీద కొత్త సంవత్సరంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.