తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి కొత్త చర్చ జరుగుతోంది. గులాబీ దళపతి సంచలన నిర్ణయం తీసుకుంటే కొందరు మాత్రం దాన్ని మరో కోణంలో చూస్తున్నారు. అదే ఉద్యోగాల భర్తీ. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు . ఇందుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించాలని సైతం కేసీఆర్ ఆదేశించారు.
గుడ్ న్యూస్ లు మొదలు
50వేల ఉద్యోగాల భర్తీలో తాజాగా కీలక ప్రకటన వెలువడింది. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సిఎం.డి. ఎన్.శ్రీధర్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొత్తం మార్చి వరకు పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకూ, రాత పరీక్ష నిర్వహించి దానిలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ప్రతిపక్షాల లెక్కలు వేరే…
అయితే, విపక్షాలు మాత్రం కేసీఆర్ తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఓటముల నేపథ్యంలో… తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న నిరుద్యోగ యువతను మాయ చేయడానికి అన్నట్టుగా సడన్ గా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారని ఆమె ఆరోపించారు. ఇది త్వరలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓట్ల కోసం కాక మరేంటని ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. “నిజంగా సర్కారుకు నిరుద్యోగులపై ప్రేమ ఉంటే లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి ఇన్నేళ్లు ఎందుకు సైలెంట్గా ఉన్నట్లు? ఇప్పుడు ఇస్తామన్న నోటిఫికేషన్లు కూడా ఫిబ్రవరి చివరిలో రిలీజ్ అవుతాయంటున్నారు.. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక వాటి భర్తీ ఉంటుందని నమ్మడం ఎలా? “ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.