తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తర్వాత బిజెపి పార్టీ విపరీతంగా జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా భారతీయ జనతాపార్టీ స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచింది. ఇదే క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా తన పర్యటనలో వారిపై విమర్శలు చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అతనిని అడ్డుకుంటూ తమ నిరసన తెలుపుతున్నారు.
ఇదే క్రమంలో ఒకటి రెండుసార్లు రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి తాజాగా కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు ఘర్షణ పడ్డారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసే విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మొదలైన వివాదం ముదిరి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇక ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడడంతో అడ్డుకోబోయిన పోలీసులను తోసివేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో వారిని అదుపు చేసే క్రమంలో కరీంనగర్ టూ టౌన్ సీఐ లక్ష్మీ బాబు కింద పడిపోయారు.
ఇక తాను కింద పడిపోవడంతో ఆగ్రహించిన సీఐ ఇరువర్గాలను ఇష్టం వచ్చినట్లు చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కపెట్టారు. ఈ గొడవ నేపథ్యంలో కరీంనగర్ అంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక నగరం మొత్తం పోలీసులు ముమ్మరంగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు.
తెలంగాణ చౌక్ దగ్గర బండి సంజయ్ దిష్టిబొమ్మ టీఆరెస్ కార్యకర్తలు దహనం చేస్తున్నప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలు కూడా అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు. ఇక దిష్టిబొమ్మ దహనం అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులకి టీఆరెస్ కార్యకర్తలకి మధ్య విపరీతమైన ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలు బిజెపి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.