YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఓ వైపు …. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ దూకుడు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు పక్షాల మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.
పంచాయతీ ఎన్నికల సమయంలో వరుస లేఖలతో అధికార పార్టీకి నిమ్మగడ్డ బీపీ పెంచేస్తున్నారు. అయితే, దీనిపై అధికార పార్టీ సైతం ఘాటు స్పందిస్తోంది. ఏకంగా గవర్నర్ ద్వారా ఇరుకున పెట్టాలని చూస్తోంది.
మంత్రులనే ఇరుకున పెడతారా? YS Jagan
మంత్రులు బొత్స సత్యనారాయణ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎస్ఈసీ రమేశ్ కుమార్ గవర్నర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంటోంది. వరుసగా సీఎస్ ఆదిత్యానాథ్ దాస్కు లేఖలు రాస్తూ వస్తున్న నిమ్మగడ్డ… గవర్నర్కు కూడా లేఖ రాయడాన్ని మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.
బొత్స, పెద్దిరెడ్డి ఫైర్
ఎస్ఈసీ నిమ్మగడ్డ వైఖరిని మంత్రి బొత్స తప్పుబట్టారు. గవర్నర్తో నియమితులైన వ్యక్తి ఆయనకు లేఖలు రాయడం ఏంటి…? అని మండిపడ్డారు. దురుద్ధేశాలతో గవర్నర్ కు తన పై ఫిర్యాదు చేయటం తన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని.. ఎస్ఈసీ నిమ్మగడ్డపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్కు లేఖ రాసినట్టు వెల్లడించారు. మంత్రినైన తన పై నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. `నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చాం. చర్యలు తీసుకోమని, మా హక్కులను కాపాడమని స్పీకర్ ను కోరాం.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే నిరాధారమైన ఫిర్యాదులు చేస్తున్నారు… ఏకగ్రీవాల స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం` అని వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతలు , మంత్రుల ఫిర్యాదు నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .