సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరాలని నిర్ణయించుకోవడమో కనీసం చేరే విషయాన్ని పరిశీలించడమో నిజమని తేలిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిర్ధారించారు. బుధవారం ఆయన మీడియోతో మాట్లాడుతూ, లక్ష్మీనారాయణ టిడిపిలో చేరితే తప్పేంటని ప్రశ్నించారు. దానితో ఆ విషయంలో బయటకు వచ్చిన వార్తలు ఉత్తి పుకార్లు కావని ధృవపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ జాయింట్ డైరక్టర్గా పని చేసిన లక్ష్మీనారాయణ వైఎస్ జగన్పై కేసులను దర్యాప్తు చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నీకది నాకిది పద్ధతి కింద అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై జగన్ను అరెస్టు చేసింది కూడా ఆయనే. జెడి లక్ష్మీనారాయణగా పేరు తెచ్చుకున్న ఆ అధికారి డెప్యుటేషన్ పూర్తి కాగానే సొంత క్యాడర్ రాష్ట్రం అయిన మహరాష్ట్రకు వెళ్లిపోయారు. తర్వాత కొన్నాళ్లకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రజాసేవకు దారి ఎంచుకునే ముందు ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలంటూ కొన్నాళ్లు పర్యటనలు చేసారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయనే ప్రకటించారు. అప్పటినుంచీ ఆయన రాజకీయ ప్రస్తానంపై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న జెడి టిడిపిలో చేరుతున్నట్లు మీడియా రిపోర్టు చేసింది. అయితే కొద్ది సేపటికి జెడి తాను టిడిపిలో చేరబోవడం లేదని వివరణ ఇచ్చారు. ఈలోపే వైసిపి నాయకుడు బొత్స సత్యనారాయణ విలేఖరుల సమావేశం పెట్టి, అదుగో చంద్రబాబు, లక్ష్మీనారాయణ ముందు నుంచీ తోడుదొంగలు అని వ్యాఖ్యానించారు.
నేడు చంద్రబాబు ఈ విషయంపై మాట్లాడుతూ, అప్పుడు సిబిఐ అధికారి హోదాలో జగన్పై కేసులు దర్యాప్తు చేసిన కారణంగా ఇవాళ లక్ష్మీనారాయణ టిడిపిలో చేరడం తప్పవుతుందా అంటూ ప్రశ్నించారు. విమర్శలకు తావు ఇవ్వడం ఇష్టం లేకనే టిడిపిలో జెడి చేరడం ఆగిపోయిందని అంటున్నారు. అది తాత్కాలికమో, శాశ్వతమో చూడాలి.