AP Politics ; ఒక ఉదాహరణ చెప్పుకుందాం..! రోడ్డుపై ఒక మాంసం ముక్కు పడి ఉంది. రెండు పిల్లులు అది నా ఆస్తి, నా ఆస్తి అంటూ కొట్టుకుంటున్నాయి. ఇంతలో మూడో పిల్లి వచ్చి దాన్ని పట్టుకుపోయింది. ఈ రెండు పిల్లలు ఆ మూడో పిల్లితో పోరాడి ఆ ముక్కని తెచ్చుకోవాలా..? లేదు “నీ వల్లే పోయింది. నీ వల్లే పోయింది” అంటూ ఒకరిపైకి ఒకరు నెట్టుకోవాలా..!? ఏపీలో ఇదే జరుగుతుంది..!
అనగనగా… ఒక రాష్ట్రంలో ఇద్దరు నాయకులున్నారు. వారికి పైన మరో నాయకుడు ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద తప్పు/ ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది అని ముందే తెలుసు. ఆ మూడో నాయకుడు ఈ రాష్ట్రానికి దెబ్బ వేయనున్నాడని తెలుసు..! సరే.. జరిగినప్పుడు ఒకరిపైకి ఒకరం నెట్టుకుందాం. ఇప్పుడు సైలెంట్ గా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉందాం అనుకుంటారా..? తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యి పోరాటం మొదలు పెడతారా..!? ఏపీలో ఇదే జరుగుతుంది..!
AP Politics ; ఒకరేమో మాజీ. 14 ఏళ్ళు సీఎంగా పని చేసారు. నిప్పు, నిజాయతీ అంటూ డబ్బు కొట్టుకుంటారు. జనంలోకి వచ్చి నానా మాటలు చెప్పుకుంటూ రాజకీయం చేస్తుంటారు. కానీ చీకటి పడితే తన బాగోతాలు బయట పడకుండా.. తన నిజ స్వరూపం తెలియకుండా పెద్దోళ్ళతో/ వ్యవస్థలతో లాబీయింగులు చేస్తూ గడిపేస్తుంటారు. అందుకే దేశంలో శక్తిగా ఉన్న బీజేపీ అంటే భయం. మోడీ అంటే భయం. మరింత వివరంగా కింద చెప్పుకుందాం..!
ఒకరేమో ప్రెజెంట్ సీఎం. 21 నెలల నుండి ఆ హోదాలో ఉన్నారు. జనబలం ఉంది, శాసనబలం ఉంది. కానీ తప్పటడుగులు వేస్తున్నారు. నాటి కేసులు మళ్ళీ తోడకుండా.. తన లోపాలు బయటకు రాకుండా.. బీజేపీతో గొడవ ఎందుకులే అనుకుంటూ.. పెద్దోళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒకరకంగా బీజేపీ అంటే / మోడీ అంటే భయంతో ఉన్నట్టే..!
“ఎస్..! ఏపీని ఇప్పుడు నాశనం చేస్తున్నది ఈ భయమే. ఇద్దరు వ్యక్తుల్లోని.. వారి పార్టీల్లోని ఆ భయమే ఇప్పుడు ఏపీని ఢిల్లీ నుండి ఆటాడుకునేలా చేస్తుంది. గట్టిగా పోరాడేవారు లేక, గట్టిగా అడిగేవారు లేక, బీజేపీని ఎదిరించే ధైర్యం లేక.. లోకల్ రాజకీయం చేసేలా చేస్తుంది. పోలవరం విషయంలో బీజేపీ చేసిన మోసాన్ని ఈ ఇద్దరూ గట్టిగా నిలదీయలేదు. ఏపీకి నిధుల విషయంలో చేసిన మోసాన్ని ఈ ఇద్దరిలో ఎవ్వరూ గట్టిగా అడగలేదు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జరుగుతున్న తతంగాన్ని కూడా పెద్దగా నిలదీయడం లేదు..!!
AP Politics ; ఏడాదిగా ఏం చేస్తున్నారు..!?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఫిబ్రవరి 5 .., 2020 లోనే రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి ప్రకటించారు. అంటే ఏడాది కిందటే రాజ్యసభలో చర్చకు వచ్చింది. సో.., టీడీపీకి, వైసీపీకి ముందే తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అడుగులు పడుతున్న అంశం రాజ్యసభలో చర్చ అంటే… రాజకీయ వర్గాలు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఏడాది పాటూ డ్రామాలు తెరతీసి.., ఇప్పుడు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ తప్పించుకుంటున్నారు. ఫలితం రాదని, నిష్ప్రయోజనం అని తెలిసిన.. ఇప్పుడు ఒక అర్ధం లేని రాజకీయం చేస్తున్నారు.
“ఫిబ్రవరి 5 , 2020 రాజ్యసభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన సమాధానమిచ్చారు. `విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రైవేటీకరణ చర్చలు జరుగున్నాయి. పోస్కో కంపెనీ ప్రతినిధులు అక్కడ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకి ప్రతిపాదనలు ఇచ్చారు. ఎంఓయూ కూడా జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు. అంటే రాజ్యసభ వేదికగానే ఏడాది కిందటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం బయట పడింది. కానీ వైసీపీ ఎంపీలు, సీఎం జగన్ కూడా.. ఇటు టీడీపీ ఎంపీలు, చంద్రబాబు కూడా ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. తమకేమి తెలియనట్టు సైలెంట్ గా ఎవరి రాజకీయంలో వాళ్ళు మునిగారు. కానీ.. ఏడాది తర్వాత ఇప్పుడు ఆ ప్రైవేటీకరణ అంశం బయటకు వచ్చి, ఉద్యమం జరుగుతుండడంతో… టీడీపీ , వైసీపీ ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. ముందే తెలిసినా నాటకాలు ఆడిన పార్టీలు.., ఇప్పుడు విశాఖలో రాజకీయ మనుగడ కోసం డ్రామాకు తెరతీశాయి..!!