National Film Awards : కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి గాను 67 వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈసారి టాలీవుడ్ కు ఐదు అవార్డులు దక్కాయి. మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి‘, నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘జెర్సీ‘ సినిమాలకు చెరు రెండు అవార్డులు దక్కాయి. అయితే తెలుగు వారి నుండి ఈ జాతీయ అవార్డుల పై విపరీత కామెంట్లు రావడం మనం చూడవచ్చు.
వివరాల్లోకి వెళితే… ‘మహర్షి‘ సినిమా కు ‘పూర్తిస్థాయి వినోదంతోపాటు పాపులర్ సినిమా‘ కేటగిరీ కింద అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఉత్తమ కొరియోగ్రఫీ కి కూడా అవార్డు లభించింది. ఈ రెండు అవార్డులు పట్ల తెలుగు ప్రేక్షకులు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ ఫ్యాన్స్ బాగానే సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయినప్పటికీ… అవార్డు రేంజ్ సినిమా కాదని భారీ స్థాయిలో సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు వినవచ్చు. ‘జెర్సీ‘ కి ఉత్తమ ప్రాంతీయ చిత్రం రావడం పట్ల ఎవరికీ పెద్దగా కంప్లైంట్స్ లేవు. అంతేకాకుండా ఉత్తమ ఎడిటర్గా ఈ సినిమాకు గాను నవీన్ నూలి కి కూడా జాతీయ అవార్డు లభించింది.
చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి‘ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మొట్టమొదటి యోధుడైన మన తెలుగు వాడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి ఒక్క కేటగిరిలో అవార్డు దక్కకపోవడం పట్ల తెలుగు ప్రేక్షకులందరూ విచారం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఎంతో వ్యయప్రయాసలు పడి తీసిన ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్, సాకేతిక విలువలు ఎంతో గొప్పగా ఉన్నా… అవార్డు రాలేదు కానీ మలయాళ ‘మరక్కార్‘చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫీచర్ ఫిలిం లో అవార్డులు దక్కాయి. కేవలం కేరళ లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోహన్ లాల్ లాంటి ప్రభావశీలి నటించిన ఈ చిత్రానికి అవార్డు ప్రకటించారని అంటున్నారు. ఇందులో కొద్దిమంది తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రధాన నటీనటులు కూడా నటించారు. తమిళనాడులో కూడా రాబోయే ఎన్నికలను మనం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
ఇక కంగనా రనౌత్ కు ‘మణికర్ణిక‘, ‘పంగా‘ చిత్రాలకు గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2014లో ‘క్వీన్‘ సినిమాకి… ఆ తర్వాతి సంవత్సరంలో ‘తను వెడ్స్ మను‘ చిత్రానికి ఆమెకు జాతీయ అవార్డులు లభించాయి. ఇప్పుడు కంగనా పై జనాలకి ఎలాంటి అభిప్రాయం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కేంద్రానికి సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ ‘రుస్తుం‘ కు అవార్డు రావడంపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. అంతకుముందు సంవత్సరం ‘ఉరి అటాక్’ సినిమాకి గాను విక్కీ కౌశల్ కి బెస్ట్ హీరో అవార్డు ఇవ్వడం కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా జాతీయ అవార్డుల ఎంపికలో రాజకీయ ప్రయోజనాలకు పట్టం కడుతున్నారు అన్న కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి.
గతంలో సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని తీసే సినిమాలకు, కళ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలకు జ్యూరీ పెద్ద పీట వేసేవారు. కానీ ఇప్పుడు పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాలను అనేక కేటగిరీల్లో ఎంపిక చేయడం చూస్తుంటే సినిమాల్లో కూడా రాజకీయాలు ఎక్కువైపోయాయి అనే భావన ప్రజల్లో కలుగుతుంది. మరి తర్వాతి సంవత్సరం నుంచి అయినా ఈ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!