న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ముకుతాడు వేస్తోంది. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు.. చిట్టచివరి నిమిషంలో మేనిఫెస్టోల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనావళిలో మార్పులు కూడా చేసింది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126లో ఈ కొత్త నిబంధన చేర్చింది. సాధారణంగా పోలింగ్ తేదీకి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం చేయకూడదు. ఆ సమయాన్ని ‘ఎన్నికల నిశ్శబ్దం’గా భావిస్తారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో తొలిదశ పోలింగ్ జరుగుతుండగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. చిట్టచివరి నిమిషంలో ఓటర్లపై ప్రభావం చూపేందుకే ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద ఫిర్యాదుచేసింది. కానీ, అప్పట్లో ఎన్నికల నిబంధనావళిలో ఇలా మేనిఫెస్టో విడుదలకు సంబంధించిన సమయం మాత్రం ఏమీ చెప్పలేదు.
ఇక ఎన్నికల నిశ్శబ్ద సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని రాజకీయ నాయకులకు ఈసీ నిర్దేశించింది. ఈ సమయంలో స్టార్ ప్రచారకులు గానీ, ఇతర నాయకులు గానీ ప్రెస్ మీట్లు పెట్టడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం కుదరదు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు అక్కడ ప్రాంతీయ టీవీ చానళ్లకు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు ఇవ్వడం వివాదమైంది. అయితే ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించారని కాంగ్రెస్ విమర్శించింది.
గతంలో పలు సందర్భాలలో ఇలాంటి వివాదాలు రావడంతో ఈసారి వీటికి అవకాశం ఇవ్వకూడదని ఈసీ భావిస్తోంది. పలు దశలుగా సాగే ఎన్నికలలో ఎన్నికలకు ముందు 48 గంటలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. మిగిలిన నియోజకవర్గాలలో ప్రచారం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నిశ్శబ్ద సమయంలో ఉన్న పార్టీలు లేదా అభ్యర్థులకు మద్దతిచ్చేలా ఆ ప్రచారం ఉండకూడదని ఈసీ చెబుతోంది. ఈసారి లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 23న విడుదలవుతాయి.