Sharmila: తెలంగాణ రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంది వైఎస్ షర్మిల. పార్టీ పేరు ప్రకటించకుండానే తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాలని..రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు షర్మిల ప్రకటన చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వైయస్ మద్దతుదారులతో అదేవిధంగా ఆత్మీయులతో..”ఆత్మీయ సమ్మేళనం” పేరిట జిల్లాల వారీగా వైయస్ ని అభిమానించే వారితో షర్మిల భేటీ కావడం జరిగింది. ఈ సమావేశాలలో వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పార్టీ పెడితే పరిస్థితి ఏంటి అన్న దానిపై ఓ కొలిక్కి వచ్చి, జూలై 8 వ తారీకు వైయస్ జయంతి నాడు పార్టీ పేరు ప్రకటించడానికి షర్మిల టీం రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు కొనసాగిస్తున్న షర్మిల తాజాగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణలో ఉద్యోగుల భర్తీ కోసం ధర్నా చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మేటర్ లోకి వెళితే దీక్ష చేస్తున్న సమయంలో తనకు అడ్డుగా కెమెరాలు ఉండటంతో తొలగించాలని మీడియాకు షర్మిల సూచించిన క్రమంలో అక్కడే సాక్షి టీవీ విలేకరులు ఉండగా వారిపై పంచ్ డైలాగ్ వేసింది. షర్మిల ఏమన్నారంటే.. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా… ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేశారు. ఆమె పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఒక్కసారిగా బిత్తరపోయారు.
అయినా కానీ షర్మిల ఎక్కడా తగ్గకుండా..తనదైన శైలిలో సాక్షి విలేకరులకు తన డైలాగులతో చురకలు అంటించారు. మొట్ట మొదటి నుండి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రావటం జగన్ కి.. ఇష్టం లేదని వైసిపి పార్టీకి చెందిన కీలక నేతలు తెలపడం జరిగింది. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టుకోవడం ఆమె సొంత నిర్ణయం అని కూడా తెలిపారు. అందువల్లే షర్మిల పొలిటికల్ కార్యక్రమాలకు సంబంధించి సాక్షి పెద్దగా కవరేజ్ చేయడం లేదన్న టాక్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సాక్షి విలేకరులపై షర్మిల పంచ్ డైలాగులు వేయటం ఆసక్తికరంగా మారింది.