Atchannaidu: అనంతపురం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై టీ డీ పీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు కనబడుతోంది. మాజీ ఎమ్మెల్యే జే సి ప్రభాకర రెడ్డి తీరుపై జిల్లాలోని మెజార్టీ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న జేసి ప్రభాకరరెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలను అవమానపడేలా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల పట్టపర్తి లో జే సి ప్రభాకర రెడ్డి పర్యటించారు. దీన్ని స్థానిక టీ డీ పీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో జే సీ ప్రభాకర రెడ్డి పర్యటించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. జే సి ప్రభాకర రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Atchannaidu: నేతలు వేరే నియోజకవర్గాల్లో పర్యటించవద్దు
ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు పేరుతో విడుదల అయిన ప్రకటన అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే జే సి ప్రభాకర రెడ్డిని దృష్టిలో పెట్టుకునే అచ్చెన్నాయుడు ఈ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు. టీ డీ పీ నాయకులు ఇతర నియోజకవర్గాల్లో పర్యటించవద్దని అచ్చెన్నాయుడు సూచించారు. పార్టీ ఆదేశాలను దిక్కరించి ఎవరైనా వేరే నియోజకవర్గాల్లో పర్యటిస్తే వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. కొంత మంది టీ డీ పీ నాయకులు ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వర్గాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారన్నారు.. దీని వల్ల కార్యకర్తలు అయోమయానికి గురి అవుతారన్నారు. అనంతపురం జిల్లాలో టీ డీ పీకి బలమైన నాయకులే ఉన్నారు. జే సి ప్రభాకర రెడ్డి మాత్రమే కాకుండా మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
జేసి ప్రభాకర్ రెడ్డికి షాక్
అనంతపురం జిల్లాలో టీడీపీ రాజకీయాలపై అచ్చెన్న స్పందించి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే అచ్చెన్నాయుడు ఆ విధంగా ప్రకటన విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణకు భంగం కలగకుండా ఉండేందుకే అచ్చెన్నాయుడు ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసి ఉంటారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అచ్చెన్నాయుడు ప్రకటన జే సి ప్రభాకర రెడ్డికి ఓ షాకింగ్ న్యూస్ కిందే లెక్క. దీనిపై జేసి ప్రభాకరరెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.