Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓ చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులతో సహా 30 మంది ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన పోలింగ్ లో 20 మంది అభ్యర్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వీరిలో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెంకట్ బల్మూరు కూడా ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్నా ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటుతో ఇతర ప్రాంతాలకు చెందిన 20 మంది హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. హైదరాబాద్ కు చెందిన బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగారు. బల్మూరి వెంకట్ తో సహా 20 మంది స్థానికేతరులు కావడంతో ఓటు వేసే అవకాశం దక్కలేదు.
Read More: EX MP Chinta Mohan: ‘చింతా’ ఏమిటి ఆ నేతలను అంత మాట అనేశారు…!!
Huzurabad By Poll: ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు
బీజేపి అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కమలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకోగా, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులు వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో ఉన్న కేశెట్టి విజయకుమార్ హూజూరాబాద్ లో , దేవునూరి శ్రీనివాస్ వీణవంక మండలం కోర్కల్ లో , సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో , పల్లే ప్రశాంత్ కమలాపూర్ మండలం కన్నూరులో, ఎం రత్తయ్య మడిపల్లిలో, మౌటం సంపత్ కమలాపూర్ లో, శనిగరపు రమేష్ బాబు కమలాపూర్ లో, రావుల సునీల్ కన్నూరులో తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వేయలేకపోయిన అభ్యర్ధులు వీరే..
అన్నా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్ధి మన్సూర్ ఆలీ మహ్మద్ తో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కన్నం సురేష్ కుమార్, కర్ర రాజిరెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు,ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, ఎడ్ల జోగిరెడ్డి, కమ్మరి ప్రవీణ్, కోట శ్యామ్ కుమార్, కంటే సాయన్న, గుగులోతు తిరుపతి, గంజి యుగంధర్, చాలిక చంద్రశేఖర్, చిలుక ఆనంద్, పడిశెట్టి రాజు, బుట్టెంగారి మాధవరెడ్డి, వేముల విక్రం రెడ్డి, సీవీ సుబ్బారెడ్డిలు స్థానికేతరులు కావడంతో వీరంతా ఓటు వేయలేకపోయారు.