CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. జిల్లాలోని గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా ప్రొద్దుటూరు, పులివెందులలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
CM YS Jagan: సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా..
- 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 12.00 నుండి 1.25 గంటల వరకూ ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అనంతరం బహిరంగ సభ. మధ్యాహ్నం 2 గంటలకు బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ – 1 కు చేరుకుంటారు. అనంతరం 2.15 బద్వేల్ రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. తదుపరి 2.20 గంటలకు మెస్సర్స్ సెంచరీ ఫ్లై పరిశ్రమ కు శంకుస్థాపన చేస్తారు. 3.20 గంటలకు సికే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకుని వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హాబ్ ఆర్చి ప్రారంభించనున్నారు సీఎం జగన్. 3.50 గంటలకు వైఎస్ఆర్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్ క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్.
- 24వ తేదీ ఉదయం 9.05 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్ధనలో పాల్గొంటారు వైఎస్ జగన్. అనంతరం 10 గంటల నుండి 12 గంటల వరకూ ఇడుపులపాయలోని ప్రార్ధనా మందిరంలో నిర్వహించే ప్రార్ధనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ కు చేరుకుని పార్క్ లో ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. 2.40 నుండి వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసి బహిరంగ సభలో లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 3.35 గంటలకు మార్కెట్ యార్డ్ కు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం మోడల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు రాణితోపు సమీపంలో అక్వా హబ్ ప్రారంభిస్తారు. 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. రాత్రి బస.
- 25వ తేదీ ఉదయం 9గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుండి బయలుదేరి 9.20 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.35 నుండి 10.55 వరకూ పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు సీఎం జగన్. 11 గంటలకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. 11.35 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం బయలుదేరతారు. 12.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.