AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సోమవారం రాత్రి పీఆర్సీపై జీవో ఇవ్వగా మంగళవారం దీనిపై ఉద్యోగ సంఘాల చర్చలు, నిరసనలు, ప్రెస్ మీట్లు, తమ కార్యాచరణ గురించి సమావేశాలు జరిగాయి. బుధవారం ఉద్యోగ సంఘాల నిరసన తెలియజేస్తే.. ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గురువారం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనల హోరు, ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ.. ఉద్యోగులు ఆశించిన 27 శాతం కాకుండా ప్రభుత్వం 23 శాతం ప్రకటించడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఈనేపథ్యంలో నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించనుంది.
గతంలో కూడా సమ్మెలు..
అయితే.. (AP Govt) ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కు తగ్గుతుందా..? ముందుకే వెళ్తుందా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే.. వారు కూడా ఈ ఉద్యమంలో ఉన్నట్టు.. పీఆర్సీని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకున్న అధికారాలు ఉపయోగిస్తుందా..? ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాబట్టి ఈ విషయంలో పునరాలోచిస్తుందా అని ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఉద్యోగుల సమ్మెపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశంలో హయాంలో కూడా ఇలా ఉద్యోగులు సమ్మెలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులు వైఎస్ హయాంలో ఓసారి, తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఓసారి ఇంతే తీవ్రతతో సమ్మెలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
క్యాబినెట్ సమావేశం కీలకం..
అయితే.. వైసీపీ (AP Govt) ప్రభుత్వం ఉద్యోగులతో అంత ఖరాఖండీగా వెళ్తుందని చెప్పలేం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా సంక్షేమానికి, పధకాల అమలుకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా సమయంలో కూడా వెనక్కు తగ్గలేదు. ఇవన్నీ కొనసాగాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరి. ప్రభుత్వానికి ప్రజలెంతో.. ఉద్యోగులూ అంతే. కాబట్టి ఉద్యోగుల డిమాండ్లపై పునరాలోచిస్తుందనే అంటున్నారు. కాబట్టి.. ఉద్యోగులను శాంతింపజేయటానికీ లేదా.. తాము ఆశించింది కాకుండా 27 శాతం ఫిట్ మెంట్ ప్రకటించినా సయోధ్య కుదిరినట్టే. మరి.. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం వస్తుందో చూడాల్సి ఉంది.