PK Report: ఏపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్మోహనరెడ్డికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోోర్ (పీకే) అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన టీమ్ నుండి ప్రతి నెలా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పనితీరు. ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కు రిపోర్టులు అందతూ ఉంటాయి. జగన్ ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలపై పీకే టీమ్ గ్రామాల్లో లబ్దిదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. ఈ పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా లేదా, లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారా అనే విషయాలను తెలుసుకుని పీకే టీమ్ జగన్ కు నివేదిస్తుంది. అయితే ఇటీవల “పీకే ఇచ్చిన రిపోర్టు” అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అనుకూల మీడియాలో ఇది ఎక్కువగా వస్తోంది. “వైసీపీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని పీకే జగన్ కు రిపోర్టు ఇచ్చారంటూ” వైరల్ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదని సమాచారం. అయితే పీకే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇన్ని సీట్లు వస్తాయి. ఇన్ని సీట్లు కోల్పోతాయి అని అయితే రిపోర్టు ఇవ్వలేదు.., కానీ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటి. ఎక్కడెక్కడ మైనస్ ఉంది. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం గురించి మాత్రమే రిపోర్టులుగా ఇస్తుంటారని సమాచారం. రాష్ట్రంలో 56 నుండి 70 నియోజకవర్గాల్లో వైసీపీకి కొంత వ్యతిరేకత ఉన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది..!
PK Report: ఆ మూడు అంశాల్లో రెడ్ అలెర్ట్..!?
ప్రధానంగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ మూడు విషయాల్లో జగన్ ను అలర్ట్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇలానే పరిస్థితులు కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అని చెప్పారని సమాచారం. ఇంతకూ ఆ మూడు విషయాలు ఏమిటంటే..
* మొదటిది.. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలనలో ఆర్ధిక పరమైన అంశం. “మనం ఎన్ని అప్పులు చేసినా గానీ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నాము కదా దీని వల్ల ప్రజల్లో సానుకూలత ఉంటుంది” అని ప్రభుత్వం భావిస్తోంది. కానీ.., ప్రజలు రాష్ట్రం చేస్తున్న అప్పులు పట్టించుకోరు. వాళ్ల జేబుల్లోకి అందే డబ్బులనే పట్టించుకుంటారు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే పీకీ టీమ్ రిపోర్టులో వెల్లడించిన విషయం ఏమిటంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కూడా ప్రజలు పట్టించుకుంటున్నారు అనేది. ప్రభుత్వం చేస్తున్న అప్పులను కూడా ప్రజలు పట్టించుకుంటున్నారు. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని అలర్ట్ చేసినట్లు సమాచారం. ఆర్ధిక పరిస్థితి అదుపు చేయాలంటే ముందుగా అప్పులు చేయడం మానాలి. అప్పులు తేవడం మానేస్తే పథకాలను నిలుపుదల చేయాల్సి వస్తుంది. పథకాలు నిలుపుదల చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఒక సారి ప్రజలకు పథకాలను అలవాటు చేసిన తరువాత వాటిని ఆపితే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాల వల్లనే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకోవడం అవివేకం అవుతుందని పీకే చెప్పినట్లు సమాచారం.
* రెండోది.. మూడు రాజధానుల వ్యవహారం. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం అనుకున్నది ఒకటి అయితే ప్రజల్లోకి వెళ్లింది మరోకటి. దీని వల్ల వైసీపీకి రావాల్సిన మైలేజ్ రాకపోగా కొన్ని జిల్లాల్లో వ్యతిరేకత వచ్చింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల అక్కడ సానుకూలత వస్తుంది అనుకుంటే అక్కడ కూడా నెగిటివ్ వచ్చిందట. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అన్న ఆరోపణలు వచ్చాయట. వీటికి తోడు ఇద్ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడంతో అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ అంశంపైనా పీకే టీమ్ అలర్ట్ చేసినట్లు
సమాచారం. విశాఖలో రావాల్సిన పాజిటివ్ రాకపోగా.. విశాఖ సహా.., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి కాస్త నెగిటివ్ వచ్చినట్టు ప్రశాంత్ కిషోర్ తన నివేదికలో పేర్కొన్నట్టు చెప్తున్నారు..!
* మూడోది.. కొంత మంది వైసీపీ నేతల వ్యవహార శైలి. కొందరు నేతలు మాట్లాడుతున్న మాటలు, వాళ్ల ప్రవర్తన, కార్యకర్తల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు, గ్రూపు రాజకీయాల మూలంగా పార్టీకి నష్టం జరుగుతుందని పీకే టీమ్ చెప్పినట్లు వార్తలు వినబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు 151 మందీ, పార్టీలో చేరిన నలుగురు,. మరో ఇంచార్జిలు సహా అన్ని చోట్ల చూసుకుంటే 70 నుండి 80 నియోజకవర్గాలల్లో వైసీపీకి స్థానిక నాయకత్వం, గ్రూపుల వలన, విబేధాలు, వివాదాలు, అవినీతి ఆరోపణలు వలన బాగా వ్యతిరేకత వచ్చినట్టు పీకే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
జగన్ సీరియస్ తీసుకుంటే..!?
ఈ మూడు వ్యవహారాలపై జగన్ ను పీకే అలర్ట్ చేసి ఇవి ఇలానే కొనసాగితే ప్రభుత్వం రావడం కష్టమే. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. సంక్షేమ పథకాలను ఆపడానికి వీలులేదు. అలా అని అప్పులు చేయడం మానేయమని కాదు. ఆదాయ మార్గాలను సృష్టించాలి. ఆదాయం పెంచుకోవడం అంటే పన్నులు వేయడం కాకుండా ప్రాజెక్టులు, పోర్టులు తదితర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని సృష్టించుకోవడం వంటి వాటిపై పీకే టీమ్ నివేదిక ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి. వీటిలో కొన్ని అంశాలను జగన్ సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలిసింది. వచ్చేనెల మొదటి వారం నుండి జిల్లాల వారీగా సమీక్షలు చేయనున్నట్టు తెలుస్తుంది..!