Chalo Vijayawada: ఏపిలో ఉద్యోగుల ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు చలో విజయవాడ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ లకు తరలించారు. టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులను పోలీసు స్టేషన్ లకు తరలించారు.
Chalo Vijayawada: మారు వేషంలో రైతుల మాదిరిగా వచ్చినా..
మరో పక్క రాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలను హౌస్ అరెస్టు చేశారు. చలో విజయవాడ కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ లేదంటూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. పోలీసు అనుమతి లేకపోయినా చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితీ నేతలు ప్రకటించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొందరు ఉద్యోగులు మారు వేషంలో రైతుల మాదిరిగా, బురకాలు వేసుకుని విజయవాడకు చేరుకున్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.
Chalo Vijayawada: నేతల హౌస్ అరెస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జివి నారాయణరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరి, ప్రగతి శీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జమాల్ రెడ్డి, ట్రెజరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ కుమార్ తదితర నేతలకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టు చేశారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు మీద భారీగా పోలీసులను మోహరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అరెస్టులను సీపీఐ రాష్ట్ర నేత రామకృష్ణ ఖండించారు. ఉద్యమాన్ని అడ్డుకునే బదులు ఉద్యోగుల సమస్యల పరిష్కానికి ప్రభుత్వం శ్రద్ద చూపాలని ఆయన హితవు పలికారు.