TTD: చేతిలో మీడియా ఉంది కదా అని భక్తుల్లో భయాందోళనలను పెంచే విధంగా కథనాలు వండి వార్చడం మంచిది కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో టోకేన్ ల కౌంటర్ ల వద్ద తోపులాటలో పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అధికారులు టోకెన్ల సిస్టమ్ ను నిలుపుదల చేసి నేరుగా భక్తులను పంపారు. అయితే తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తుల రద్దీ అంచనా వేసి తదనుగుణంగా చర్యలు చేపట్టడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారు. ఆ రోజు జరిగిన ఘటనపై మీడియాలో వార్తలు రావడం, ఆ వార్తలను పురస్కరించుకుని ప్రతిపక్షాలు టీటీడీని విమర్శించడం జరిగింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేడు స్పందించారు. శుక్రవారం తిరుపతి గోశాలలో నెయ్యి తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు.
TTD: విజిలెన్స్, క్షేత్ర స్థాయి సిబ్బంది అంచనాలు తప్పడంతో
ఈ సందర్భంలో మూడు రోజుల క్రితం జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు వైవీ సుబ్బారెడ్డి. ఒక్క సారిగా పెరిగిన భక్తుల రద్దీపై టీటీడీ విజిలెన్స్, క్షేత్ర స్థాయి సిబ్బంది అంచనాలు తప్పడంతో భక్తుల తోపులాట చోటుచేసుకుందని అన్నారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టామన్నారు. భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు చెప్పారు. వేసవిలో రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశామనీ, దానికి తగ్గట్లు గానే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
అసత్యాలను ప్రచారం చేయడం తగదు
జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు చిలువలు పలువలు చేసి అసత్యాలను ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. భగవంతుడు అన్నీ చూస్తుంటారనీ, భక్తులు ఇలాంటి కట్టు కథనాలు నమ్మరు అని అన్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదా అని ప్రశ్నించారు వైవీ. ఏకంగా కంపార్ట్ మెంట్ల గేట్లు విరిగిపోయిన ఘటనలు మరిచిపోయారా అని వైవీ గుర్తు చేశారు. తిరుమల క్యూలైన్ లలో భక్తులకు పాలు, ఆహారం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.