Asani Cyclone: ఆసనీ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. సహాయ చర్యలపై సమీక్ష జరిపి తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో హై అలెర్ట్ గా ఉండాలన్నారు. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని అన్నారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం జగన్ తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్నారు. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలనీ, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన ప్రదేశాల్లో సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని సీఎం ఆదేశించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Asani Cyclone: తుఫాను బాధితుల పట్ల మానవతా దృక్పదంతో వ్యవహరించాలి
సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి వెయ్యి, కుటుంబానికి రూ.2వేల వంతున ఇవ్వాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, జనరేటర్ లు, జేసీబీ లు కూడా సిద్దం చేసుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను బాధితుల పట్ల మానవతా దృక్పదంతో వ్యవహరించాలని వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని జగన్ సూచించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని అన్నారు. సెంట్రల్ హెల్ప్ లైన్ తో పాటు జిల్లాల వారిగా హెల్ప్ లైన్ నంబర్లు సమర్ధవంతంగా పని చేసేలా చూడాలనీ, వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించాలని, ఆ నెంబర్ లను బాగా ప్రచారం కల్పించాలని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు పంపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.