MLC Driver Murder Case: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాస్కర్ బాబు (అనంత బాబు) మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన సుబ్రమణ్యం హత్యకు గురైయ్యాడు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్రమణ్యం ఇంటి నుండి బయటకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి మద్యం కొనుగోలు చేసి సమీపంలోని పాఠశాలకు వెళ్లి మద్యం సేవించారు. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారు. ఆ తరువాత స్నేహితులతో కలిసి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ అనంత బాబు అక్కడకు వచ్చి సుబ్రమణ్యంలో కారులో ఎక్కించుకుని వెళ్లారు. వీరు ఇద్దరూ కొంత దూరం వెళ్లిన తరువాత జన్మభూమి పార్క్ ప్రాంతంలో టిఫిన్ తీసుకుని ఎమ్మెల్సీ నివాసం శంకర్ టవర్స్ వైపుకు వెళ్లారు. గతంలో సుబ్రమణ్యం వివాహ సమయంలో కొంత నగదును ఆనంతబాబు ఇచ్చారు. ఆ నగదు విషయంపై ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. మద్యం అలవాటు మానుకోలేదు. నీ ప్రవర్తనలో మార్పు లేదు అంటూ సుబ్రమణ్యం మందలిస్తూ అనంతబాబు కొట్టాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న సుబ్రమణ్యం ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తనకు ఎదురుతిరుగుతావా అంటూ సుబ్రమణ్యంను అనంత బాబు గట్టిగా తోయడంతో డ్రైనేజీ గట్టుపై సుబ్రమణ్యం పడటంతో తలకు గాయమైంది. దీంతో సుబ్రమణ్యం నన్నే కొడతావా అంటూ అనంతబాబు మీదకు వెళ్లడంతో మెడపై చేయి వేసి తోసేశాడు. దీంతో మరో సారి తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అనుకున్నాడు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరు. కారులో ఉన్న సమయంలో సుబ్రమణ్యం ఎక్కిళ్లు రావడంతో అనంత బాబు నీళ్లు తాగించాడు. నీళ్లు తాగిన కొద్ది సేపటికి అతనిలో చలనం లేదు. సుబ్రమణ్యం మృతి చెందినట్లు అనంత బాబు గమనించారు. గతంలో సుబ్రమణ్యం మధ్యం సేవించి ఆక్సిడెంట్ లు చేసిన చరిత్ర ఉండటంతో ఈ ఘటనను యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలని పథకాన్ని రచించారు. యాక్సిడెంట్ అని చిత్రీకరించాలంటే వంటిపై గాాయాలు ఉండాలని భావించి డంపింగ్ యార్డ్ కు తీసుకువెళ్లి అక్కడ కర్రలు, తాళ్లతో తీవ్రంగా కొట్టాడు.
అ తరువాత సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి సుబ్బుకు యాక్సిడెంట్ అయ్యింది. అమృత ఆసుపత్రికి తీసుకువెళుతున్నాను, అక్కడకు రావాలని వారికి చెప్పారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయానికి అతను మృతి చెంది ఉన్నట్లు వైద్యులు దృవీకరించారు. అతని మృతదేహాన్ని అనంతబాబు స్వయంగా తన కారులో వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలో సుబ్రమణ్యం వంటిపై గాయాలు ఉండటంతో అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ అనంత బాబుతో గొడవకు దిగారు. ఈ వాగ్వివాదం నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. దీంతో అనంత బాబు కారు అక్కడే వదిలివేసి బైక్ పై అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఈ విషయాలు అన్నీ తమ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ రవీంద్రనాథ్ వెల్లడించారు.