కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరో సారి కరోనా బారినపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు ముందు సోనియా గాంధీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోస్టు కరోనా ఇబ్బందుల కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. పూర్తిగా కోలుకున్న తరువాత ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా శనివారం మరో సారి సోనియా గాంధీకి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల మూడు రోజుల పాటు సోనియా గాంధీ ఈడీ విచారణకు హజరయ్యారు. పార్టీ నేతతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సోనియా మరో సారి కరోనా బారిన పడటం గమనార్హం. సోనియా గాంధీ మరో సారి కరోనా బారిన పడిన విషయాన్ని ఆ పార్టీ నేత జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా లక్షణాలు కనిపించడంతో సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వరకూ పాదయాత్ర ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాల కారణంగా యాత్రలో పాల్గొనడం లేదంటూ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు రేవంత్ రెడ్డి. అంతకు ముందే అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెబుతూ వీడియో సందేశాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి చేసిన డిమాండ్ నకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.