రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల మహ పాదయాత్ర 37వ రోజు రాజమహేంద్రవరం పరిధి మల్లయ్యపేట నుండి ప్రారంభమై పట్టణం మీదుగా సాగుతోంది. దాదాపు 8 కిలో మీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగనుండగా, రైతుల పాదయాత్రకు సంఘీభావంగా పలు రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. పాదయాత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, పలువురు సీపీఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆజాద్ చౌక్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నల్ల బెలూన్లు, మూడు రంగుల బెలూన్లతో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరువర్గాలను కంట్రోల్ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆజాద్ చౌక్ వద్ద ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెప్పులు, వాటర్ పాకెట్లు, వాటర్ బాటిళ్లు విరుసుకున్నారు. టీడీపీ బినామీలు గోబ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇరుపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు దూసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరో పక్క టీడీపీ నేతలను పోలీసులు నిలవరించారు., ఇరువర్గాల పోటీపోటీ నినాదాలు, అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు వర్గాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వైసీపీ నిరసనల హోరు మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. మరో పక్క మూడు రాజదానులకు అనుకూలంగా ఆజాద్ చౌక్ వద్ద జరిగే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, ఎంపీ సుభాష్ చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.