Election Survey: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్ధుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. నియోజకవర్గాల ఇన్ చార్జిల చేర్పులు, మార్పులు చేస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల నుండి సామాన్య ప్రజల వరకూ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది.
మరో పక్క సర్వే సంస్థలు కూడా ప్రజల నాటి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలు తాజాగా సర్వే నిర్వహించారు. ఆ సర్వే సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించింది.
రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో 24 – 25 సీట్లను ఆ పార్టీ కైవశం చేసుకుంటుందని ప్రకటించింది. ఫ్యాన్ గాలికి టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు ఎగిరిపోవడం ఖాయమన్నట్లుగా స్పష్టం చేసింది. టీడీపీకి గరిష్టంగా ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక బీజేపీ, జనసేన ఒక్క స్థానంలోనూ గెలవలేదని పేర్కొంది. గతంలో వెల్లడైన పలు సర్వే సంస్థల అంచనాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తొంది.
ఏపీలో 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ .. ప్రస్తుతం మరింత బలపడిందని స్పష్టం అవుతోంది. గత అయిదేళ్లలో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో వైసీపీకి ప్రజాదరణ పెరిగిందని, ఈ కారణంగానే వైసీపీకి 22 స్థానాల నుండి 25 లోక్ సభ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసే స్థాయికి చేరుకుందని విశ్లేషించింది.
జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రభంజనం ఉన్నట్లుగా ఈ సర్వే వెల్లడించింది. మొత్తం లోక్ సభలో 543 స్థానాలకు గానూ బీజేపీ 308 నుండి 328 స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 52 – 72 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. మూడో అతి పెద్ద పార్టీ గా వైఎస్ఆర్ సీపీ నిలవనుందని చెప్పింది. డీఎంకే, టీఎంసీలు 20 నుండి 24 స్థానాలు, బీజేడీ 13 నుండి 15, బీఆర్ఎస్ 3 – 5, ఏఏపీ 4 – 7, ఇతరులు 66 నుండి 76 స్థానాలు కైవశం చేసుకోవచ్చని సర్వే వెల్లడించింది.