YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ పార్టీ విలీనం అయ్యింది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల.. గురువారం ఉదయం తన భర్త అనిల్, పలువురు అభిమానులతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తదితరుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై జోరుగా ఊహగానాలు కొనసాగుతున్నాయి.
ఏపీయే కాదు అండమాన్ కు వెళ్లమన్నా వెళ్తా..
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు వైఎస్ షర్మిల. ఈరోజు నుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ ఒక భాగమని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత, ఆయన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. దేశంలో అతిపెద్ద లౌకక పార్టీ కాంగ్రెస్, అన్ని వర్గాలను కలుపుతూ పని చేస్తుందని అన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని చెప్పారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి అశయమని, అది నెరవేర్చడానికి మనస్పూర్తిగా పని చేస్తానని తెలిపారు. ఏపీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏపీయే కాదు పార్టీ అండమాన్ వెళ్లమన్నా వెళ్తానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని షర్మిల తెలిపారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు..? ..ఆప్ మంత్రుల ట్వీట్